దళితబంధు పథకం ద్వారా లబ్ధిదారులకు నచ్చిన, వచ్చిన పనిలోనే ఉపాధి కల్పిస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే ఎంపిక ప్రక్రియ నిర్వహి స్తామని చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభించామని, మార్చి రెండో వారంకల్లా పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లా పరిధిలో దళిత బంధు అమలు, ఎంపిక ప్రక్రియపై ఆమె పలు వివరాలు వెల్లడించారు.
ఆదిలాబాద్ , జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘దళితబంధు పథకం దేశానికే ఆదర్శం. జిల్లాలో పారదర్శకంగా, పకడ్బందీగా అమలు చేసేందుకు సన్నద్ధమవుతున్నాం. ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తాం. ఎంపికైన లబ్ధిదారులకు జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రభుత్వం సూచించిన వాటితో పాటు జిల్లాకు ఉపయోగపడే యూనిట్లను కూడా లబ్ధిదారులు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది’ అని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం నమస్తే తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన పలు వివరాలు..
నమస్తే: జిల్లాలో దళితబంధుఅమలు ఎంత వరకు వచ్చింది?
కలెక్టర్: డిసెంబర్ 18న హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో దళితబంధు పథకం అమలుపై పలు సూచనలు చేశారు. అప్పటి నుంచే ఈ పథకం అమలుపై కార్యాచరణ ప్రారంభించాం. ఎమ్మెల్యేలతో ప్రాథమికంగా చర్చించాం. జిల్లాలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలు పూర్తిగా, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు కొంతమేర ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. జిల్లాలో దళితబంధు కార్యక్రమం విజయవంతం అయ్యేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం
నమస్తే: పథకం అమలుకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్లానింగ్ ఎలా ఉంటుంది?
కలెక్టర్ : ఈ పథకంలో ఎమ్మెల్యేలు కీలకపాత్ర వహిస్తారు. లబ్ధిదారులను ఎంపిక చేయడంతో పాటు వారికి ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయి.. వారు ఏ రంగంలో ఆసక్తిగా ఉన్నారనే విషయాలు తెలుసుకుంటారు. లబ్ధిదారులకు జిల్లా యంత్రాంగం తరఫున అవసరమైన శిక్షణ ఇస్తాం. స్కిల్ డెవలమెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తాం. యూనిట్ల గ్రౌండింగ్లో సైతం సహకారం అందిస్తాం.
నమస్తే: లబ్ధిదారుల ఎంపిక ఎప్పటి వరకు పూర్తికానుంది..?
కలెక్టర్: జిల్లాలోని ఆయా గ్రామాల్లో లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఎమ్మెల్యేలు ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు. అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాగానే వారికి ఉపాధి మరింత మెరుగుపర్చే కార్యక్రమాలు చేపడుతాం. మార్చి మొదటి లేదా రెండో వారంలో యూనిట్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం.
నమస్తే:దళితబంధు పథకంలో ప్రస్తుతం ఉన్న యూనిట్లు ఉంటాయా? జిల్లాకు సంబంధించి ఏమైన ప్రతిపాదనలు ఉన్నాయా?
కలెక్టర్: నచ్చిన పని- వచ్చిన పని ద్వారా ఉపాధి కల్పించడం ప్రధాన లక్ష్యం. గవర్నమెంట్ చెప్పిన పథకాలతో పాటు లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత వారిలో ఉన్న నైపుణ్యాలు, వారి కోరిక మేరకు యూనిట్లను మంజూరు చేస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వద్ద ఆదిలాబాద్ జిల్లాకు ఉపయోగపడే యూనిట్ల లిస్ట్ కూడా ఉంది. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయి. టమాట, సోయా, కంది, పాడి పరిశ్రమకు సంబంధించిన వాటితో పాటు పేపర్ ప్లేట్స్ ప్రపోజల్స్ ఉన్నాయి. లబ్ధిదారులు ఏదీ కావాలనుకుంటే అది అందిస్తాం.
నమస్తే: జిల్లాలో ఈ పథకం కింద ఎన్ని నిధులు ఖర్చు చేయనున్నారు?
కలెక్టర్: జిల్లా పరిధిలో ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలు పూర్తిగా, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు కొంత వస్తాయి. నియోజకవర్గానికి వంద యూనిట్ల చొప్పున ఎమ్మెల్యేలు ఎంపిక చేసిన ప్రకారం యూనిట్లు మంజూరవుతాయి. జిల్లా వ్యాప్తంగా రెండు వందలకు పైగా లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. ఇప్పటికే రెండు విడుతలుగా కో-ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాం. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్కు అధికారులందరూ హాజరయ్యారు. లబ్ధిదారుల ఎంపిక తర్వాత గ్రామాల వారీగా నియోజకవర్గాలు, జిల్లా వారీగా ప్రత్యేక అధికారులను నియమించి వారి ఉపాధిని మెరుగుపర్చే విధంగా చర్యలు తీసుకుంటాం. చాలా గొప్ప పథకం, అందరికీ అవగాహన ఉంది. మొదటి విడుత కాబట్టి వంద యూనిట్లు ఇస్తున్నారు.