హైదరాబాద్: పుట్టినరోజు నాడే ఓ యువకుడు దుర్మరణం చెందాడు. బర్త్ డే వేడుకల కోసం తన ఇద్దరు స్నేహితులతో కలిసి కేక్ తీసుకుని వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది. దీంతో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తొలుత ఏదో వాహనం వీరిని ఢీకొట్టిందని అందరూ అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో అది నిజం కాదని తేలింది. అతివేగమే వారిని బలి తీసుకుందని నిర్ధారణ అయింది.
జయవర్ధన్ (18), విష్ణు (18), వరప్రసాద్(15) ముగ్గురు మిత్రులు. జయవర్ధన్ పుట్టినరోజు కావడంతో దేవుని ఎరవెల్లి నుంచి తన స్నేహితులు విష్ణువర్ధన్, ప్రసాద్కుమార్ సాయంత్రం 6.30 దాటిన తర్వాత చేవెళ్లకు కేక్ కోసం బయలుదేరారు. అక్కడ కేక్ తీసుకుని తిరిగి వస్తుండగా బాలాజీ గార్డెన్ వద్దకు రాత్రి 7.02 నుంచి 7.04 సమయంలో చేరుకున్నారు. అయితే బైక్ను వేగంగా నడపడంతో అదుపుతప్పిన బైక్.. డివైడర్ను ఢీకొట్టింది. ఎవరికీ హెల్మెట్ లేకపోవడంతో తలకు దెబ్బ బలంగా తాకి ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఓ ద్విచక్రవాహనదారుడు వారిని గమనించి డయల్ 100కు ఫోన్ చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన చేవెళ్ల పోలీసులు.. హైవేపై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ప్రమాదం జరిగిన పాయింట్ నుంచి వెనకాల, ముందు వైపు రోడ్డుతో పాటు ఆ సమయంలో ఏదైనా వాహనాలు వచ్చాయా అని చెక్ చేశారు. కానీ ఏ వాహనం రాలేదని వాళ్లు నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత రోడ్డుపై వ్యాపారాలు చేసుకునే వారిని విచారించగా అతివేగంతో వెళ్లినట్లు తేలింది. దీంతో అన్ని సాక్ష్యాధారాలను పరిశీలించిన పోలీసులు అతివేగమే ప్రమాదానికి కారణమని తేల్చారు.
తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వాహనాలను మైనర్లకు ఇవ్వకండి, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత వారికి రోడ్లపై వాహనాలను నడిపించే పూర్తి పరిజ్ఞానం పొందిన తర్వాతనే వాహనాలు ఇవ్వండని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరుతున్నారు.