రాంనగర్/కొత్తపల్లి, సెప్టెంబర్ 24: లంచం డిమాండ్ చేసి ఓ పంచాయతీ కార్యదర్శి అడ్డంగా దొరికిపోయాడు. రేకుల ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఓ విశ్రాంత సైనికుడి నుంచి 90వేలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులు చిక్కాడు. కరీంనగరంలోని ఆర్టీసీ వర్క్షాప్ వద్ద జరిగిన ఘటన కలకలం రేపింది. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బావుపేటకు చెందిన తిరుపతి విశ్రాంత సైనికుడు. విరమణ పొందగా వచ్చిన డబ్బులతో కుటుంబ పోషణ కోసం గ్రామంలో రేకుల ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాడు.
ప్రభుత్వ ఫీజు చెల్లించి నిర్మాణానికి గ్రామ పంచాయతీ నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉండడంతో బావుపేట-ఆసిఫ్నగర్ కార్యదర్శి వుట్కూరి శ్రీధర్ను సంద్రించాడు. అయితే ఎన్వోసీ ఇచ్చేందుకు కార్యదర్శి తిప్పించుకున్నాడు. లక్ష లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇస్తే తప్పా పని కాదని స్పష్టం చేయడంతో ఏం చేయాలో తెలియక తిరుపతి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. 90వేలు తీసుకొని ఎన్వోసీ ఇచ్చేందుకు సెక్రటరీ అంగీకరీంచగా, ఆ మొత్తాన్ని శనివారం ఉదయం ఆర్టీసీ వర్కుషాప్ సమీపంలో తిరుపతి ముట్టచెప్పాడు.
అప్పటికే మాటువేసి ఉన్న అవినీతి నిరోధకశాఖ అధికారులు, డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డబ్బులను స్వాధీనం చేసుకుని రసాయనిక పరీక్షలు నిర్వహించగా నిర్ధారణ కావడంతో అదుపులోకి తీసుకుని కార్యాలయానికి తరలించారు. విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు.