TSRTC | హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అమల్లోకి తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం.. నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మొన్నటివరకు బస్సుల్లో సీట్ల కోసం మహిళలు జుట్లు పట్టుకుని మరీ కొట్టుకుంటే.. ఇప్పుడు అదే మహిళలు మాకు ఫ్రీ బస్సు లేకున్నా మంచిదే.. ఎందుకిట్ల మోసం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కనిపిస్తే చాలు.. బస్సులో జనాలు ఉన్నా లేకున్నా ఆపకుండా వెళ్లిపోతున్నారని మండిపడుతున్నారు. ఇదే.. విషయమై ఓ మహిళ బస్టాండ్లో తన గోడు వెళ్లబోసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ కోపంతో ఊగిపోతూ.. ధర్మారంలోని ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుంది. తాను అర్జెంట్ పని మీద మంచిర్యాలలోని మందమర్రి గ్రామానికి వెళ్లేందుకు.. ఉదయం 7 గంటలకే బస్టాండుకు వచ్చి ఎదురుచూస్తుండగా.. తనను చూసి కూడా డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. వేరే బస్సు వచ్చే వరకు ఎదురుచూసి.. అది పట్టుకుని ధర్మారం వరకు చేరుకుని.. ఈ విషయాన్ని అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. అక్కడ అధికారి లేకపోవడంతో.. తోటి ప్రయాణికులతో తన ఆక్రందన చెప్పుకుంది. ‘ నాకు ఫ్రీ టికెట్ అవసరమే లేదు. నేను పైసల్ కూడా తెచ్చుకున్నా. అయినా బస్సు ఆపకుండా దంచుకపోయిండు. నేను మంచిర్యాలలోని మందమర్రికి పోవాలె. ఆ బస్సు కోసం 7 గంటల నుంచి ఎదురుచూస్తుంటే.. ఆపకుండా పోయిండు. ఏదో బస్సు ఎక్కి ఇక్కడి దాకా వచ్చిన. మళ్లీ ఇంకో బస్సు ఎప్పుడొస్తది.. నేను ఎప్పుడు పోతా.. ఆపతికి పోతుంటే ఇట్ల చేస్తే ఎట్లా. ఫ్రీ బస్సు పథకం అని పెట్టి.. ఎందుకు ఇంత మోసం చేస్తున్నారు. అంటూ ఆక్రందన వెళ్లగక్కింది.
దీంతో.. అక్కడే ఉన్న మిగతా మహిళలు కూడా ఆమెతో స్వరం కలిపారు. అందరు డ్రైవర్లు అలాగే చేస్తున్నారు. ఆడవాళ్లు కనిపిస్తే చాలు బస్సు ఆపకుండా పోతున్నారు. అంటూ ఓ మహిళ చెప్పుకొచ్చింది. మరోవైపు.. ఈరోజు ఎగ్జామ్ ఉంది.. ఒక బస్సు కూడా ఆపలేదు. టైం అయిపోతుందని బండి పట్టుకుని వచ్చాను. అంటూ మరో మహిళ తన కష్టాన్ని వివరించింది. ఈ మహిళల గోడును మొత్తం వీడియో తీసిన ఓ యువకుడు.. దాన్ని సోషల్ మీడియాలో పెట్టడగా..అది వైరల్గా మారింది.