హైదరాబాద్, ఫిబ్రవరి 23 : విద్యావసతుల కల్పనలో తెలంగాణ రాష్ట్రం జాతీయ సగటును తలదన్నే స్థాయిలో ఉన్నది. రాష్ట్రంలో సగటున 147 మంది విద్యార్థులకు ఒక పాఠశాల ఉన్నది. 23 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. రాష్ట్ర అర్థగణాంకశాఖ రూపొందించిన తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ నివేదిక -2021లో వెల్లడించింది. రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలలు కలిపి 40 వేల పైచిలుకు ఉన్నాయి. వీటిల్లో 60 లక్షల పైచిలుకు విద్యార్థులు చదువుతున్నారు. జీఈఆర్, ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి, డ్రాపౌట్ రేట్లో తెలంగాణ ఉత్తమ ప్రదర్శన కనబర్చినట్టు నివేదిక తెలిపింది.
ప్రాథమిక స్థాయిలో జీరో డ్రాపౌట్స్
రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేటు (మధ్యలోనే బడి మానేసే విద్యార్థుల శాతం) జీరోకు చేరువలో ఉన్నది. దీన్నిబట్టి రాష్ట్రంలో బడి ఈడు పిల్లలంతా పాఠశాలలకు వెళ్తున్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో డ్రాపౌట్ రేటు 0.06 శాతం ఉండగా, ఉన్నత పాఠశాలల్లో 12.2 శాతం ఉన్నది. డ్రాపౌట్ రేటు అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నమోదైంది. ఇక్కడ ప్రాథమిక స్థాయిలో 5.2 శాతం, ఉన్నత పాఠశాలల్లో 29.5 శాతం డ్రాపౌట్స్ ఉన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల విభాగంలో నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 4.4 డ్రాపౌట్ రేట్ ఉన్నది.