పరకాల, ఏప్రిల్ 18 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనను గాలికి వదిలేసిందని, పార్టీ కార్యకర్తలను వంచిస్తున్నదని, అందుకే వారు బీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. వీరికి చల్లా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి 420 హామీలను అమలు చేయకుండా పాలనను పక్కదారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ పాలనలో ప్రజలకు కష్టాలు తప్పడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మాదిగలకు అన్యాయం జరుగుతున్నదని, మాదిగలకు అండగా నిలిచిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని అన్నారు. కాగా. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, అధికార పార్టీ ఆగడాలను ఎప్పటికప్పుడు ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మండల సమన్వయ కమిటీ సభ్యుడు ఆముదాలపల్లి అశోక్, గ్రామ అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు.
మాదిగ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని బీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు మంగళపల్లి రాజయ్య, మంగళపల్లి కుమారస్వామి, మంగళపల్లి రమేశ్, మంగళపల్లి నగేశ్ అన్నారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. వంద రోజుల పాలన పూర్తయినా ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. సాగు నీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, మోటర్ల ద్వారా నీటిని అందిద్దామంటే కరెంటు ఉండడం లేదన్నారు. మళ్లా కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు.