తిరుమల: మొట్టమొదటిసారిగా ‘ గోవింద కోటి’ (Govinda Koti)ని రాసిన విద్యార్థిని కుమారి కీర్తనకు తిరుమల (Tirumala ) లో శ్రీవారి బ్రేక్ దర్శనం అవకాశం దక్కించుకుంది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది. 2023 నవరాత్రుల నుంచి గోవింద కోటిని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం భక్తిశ్రద్ధలతో గోవింద కోటిని రాసిన మొట్టమొదటి భక్తురాలిగా అవకాశం ఆమెకు దక్కింది . దీంతో రాసిన గోవింద కోటి కాపీలతో ఆలయానికి చేరుకున్న ఆమెకు, ఆమె కుటుంబ సభ్యులకు టీటీడీ అధికారులు బ్రేక్ దర్శనం (Break Darsan) కల్పించారు.
విద్యార్థులు, చిన్న పిల్లలు, యువతి యువకులలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు గోవింద కోటి రాసే బృహత్తర కార్యక్రమాన్ని కొన్ని నెలల క్రితం టీటీడీ(TTD) ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 10 లక్షల 1,116 సార్లు గోవింద కోటి రాసిన వారికి శ్రీవారి బ్రేక్ దర్శనం, కోటి సార్లు గోవిందా కోటి రాసిన వారికి, వారితో పాటు, వారి కుటుంబ సభ్యులకు బ్రేక్ దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది.
ఇందులో భాగంగా బెంగళూరుకు చెందిన కీర్తన 10 లక్షల 1,116 గోవింద కోటిని రాయడంతో ఆమెకు బ్రేక్ దర్శనం అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా కుమారి కీర్తన మీడియాతో మాట్లాడుతూ తమ పెద్దలు, ఊరివారు చిన్నతనం నుంచి రామకోటి రాయడాన్ని చూసానని తెలపారు. మా కులదైవమైన వేంకటేశ్వరస్వామి అనుగ్రహంతో గోవింద కోటి రాసే అవకాశం తనకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.