మహబూబాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ) : గులాబీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బుధవారం మానుకోట జిల్లాలో పర్యటించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహిస్తు న్న ఆయన ఇవాళ మహబూబాబాద్ పట్టణంలోని ఇందిరాగాంధీ సెంటర్లో రోడ్షోలో పాల్గొననున్నారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎన్నికల సంగ్రామంలో కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో ఈ యాత్ర తలపెట్టగా బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత విజయాన్ని కాంక్షిస్తూ ప్రచా రం చేయనున్నారు. రోడ్షోను విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు విశేష కృషిచేస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణుల్లో నయాజోష్ నింపి, ఈ ఎన్నికల్లో పార్టీని విజయతీరానికి నడిపించేందుకు బస్సుయాత్ర దోహదపడుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఇల్లెందు, బయ్యారం మీదుగా మానుకోట పట్టణంలోకి ప్రవేశించనున్నారు. మానుకోట పట్టణంలో బుధవారం సాయంత్రం కేసీఆర్ రోడ్షో ప్రారంభమై రాత్రి వరకు కొనసాగనున్నది. కొత్తగూడెం నుంచి బస్సుయాత్ర నేరుగా జిల్లా దవాఖాన వద్దకు చేరుకుంటుంది. అక్కడినుంచి నెహ్రూ సెంటర్ మీదుగా ఇందిరాగాంధీ సెంటర్కు చేరుకుంటుంది. జిల్లా దవాఖాన నుంచి బస్సుయాత్రతో పాటు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొననున్నారు. ర్యాలీ సందర్భంగా కేసీఆర్కు ఘన స్వాగతం చెప్పేందుకు డప్పుచప్పుళ్లతో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బోనాలు, బతుకమ్మలతో మహిళలు స్వాగతం పలుకనున్నారు. ఈ సందర్భంగా దారి పొడవునా కేసీఆర్ ప్రయాణించే బస్సుపై పూలవర్షం కురిపించేందుకు శ్రేణు లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మానుకోటలో రోడ్షోలో పూర్తయిన తర్వాత కేసీఆర్ నేరుగా హనుమకొండ హంటర్రోడ్డులోని కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంట్లో బస చేయనున్నారు.
కేసీఆర్ బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో బస్సుయాత్ర రూట్ను మంగళవారం ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కళ్లపల్లి రవీందర్రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, మానుకోట మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న పరిశీలించారు. పట్టణ శివారులోని ధరణి హాస్పిటల్, మార్కెట్ కూడలి, మథర్థెరిస్సా సెంటర్, వివేకానంద సెంటర్, నర్సంపేట బైపాస్ రోడ్తో పాటు జిల్లా దవాఖాన, నెహ్రూ సెంటర్, ఇందిరాగాంధీ సెంటర్లను బీఆర్ఎస్ నేతలు పరిశీలించి ఇందిరాగాంధీ సెంటర్ను ఫైనల్ చేశారు.
ఉద్యమనేత కేసీఆర్ రోడ్షో సందర్భంగా మానుకోట పట్టణమంతా గులాబీమయమైంది. అన్ని కూడళ్లను గులాబీ జెండాలు, తోరణాలతో ముస్తాబు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గతేడాది అక్టోబర్ 27న మహబూబాబాద్ ప్రచారంలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం బుధవారం మానుకోటకు వస్తుండడంతో ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. మానుకోట పార్లమెంట్కు బీఆర్ఎస్ అభ్యర్థిగా మొదటి జాబితాలోనే సీటు దక్కించుకున్న మాలోత్ కవిత గెలుపు కోరుతు బీఆర్ఎస్ శ్రేణులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పోలిస్తే బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవితకు ప్రజల్లో మంచి పేరుంది. బుధవారం బీఆర్ఎస్ అధినేత రోడ్షోతో కవిత భారీ మెజార్టీతో గెలుస్తుందని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.