బాన్సువాడ: గ్రామాల్లో దశాబ్దాల కాలంగా పోడు భూముల సమస్యతో పట్టాలు లేక ఇబ్బందుల పాలవుతున్న గిరిజన రైతాంగానికి శాశ్వత పరిష్కారం లభించనుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడలోని స్వగృహంలో రెవెన్యూ, అటవీశాఖ, ప్రజా ప్రతినిధులతో కలిసి పోడు భూములపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, అటవీశాఖ సిబ్బంది ఉమ్మడిగా సర్వే నిర్వహించి, ముందుగా రెవెన్యూ అటవీ భూముల సరిహద్దులను గుర్తించాలని సూచించారు .
అనంతరం గిరిజనులు అయి ఉండి 2005 , డిసెంబర్ 13 కు ముందు నుంచి పోడు భూమిలో కబ్జా లో ఉన్న వారికి ఆర్వోఆర్ పట్టాలు అందుతాయని చెప్పారు. పట్టాల కోసం కొత్తగా భూములనుకబ్జాలు చేయరాదని అన్నారు . రెవెన్యూ భూములు, అసైన్డు భూములలో కబ్జాల్లో ఉన్న వారికి అసైన్డ్ పట్టాలు రెవెన్యూ అధికారుల ద్వారా తీసుకోవచ్చని తెలిపారు. కొంత మంది బ్రోకర్లు గ్రామాల్లో గిరిజనులు, పేదల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధంగానే పోడు భూముల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు,సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్వో నిఖిత, ఆర్డీవోలు రాజాగౌడ్, రాజేశ్వర్ , ఎఫ్ఆర్వో గంగాధర్, తాసీల్దార్ గంగాధర్ , గిర్దావరి రామకృష్ణ, జిల్లా రైతు బంధు సమితి కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, సొసైటీ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, వైస్ చైర్మెన్ షేక్ జుబేర్ తదితరులు పాల్గొన్నారు.