Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో దారుణ హత్య వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. మండల కేంద్రానికి చెందిన బురానుద్దీన్ అనే వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. కుటుంబ సభ్యులే అతడిని హత్య చేసి, మృతదేహాన్ని సంచిలో పెట్టి ఇంట్లోని ఓ గదిలో దాచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం.. బురానుద్దీన్ భార్య, ఇద్దరు కుమారులతో కలిసి కొంతకాలంగా ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే గత మూడు రోజులుగా ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా అందుబాటులో లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. ఇదే సమయంలో ఇంటి నుంచి దుర్వాసన రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీఐ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్లను రంగంలోకి దించి ఆధారాలను సేకరించారు. అనంతరం ఇంట్లోని ఓ గదిలో కవర్ సంచిలో ఉన్న బురానుద్దీన్ మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య, ఇద్దరు కుమారులు పరారీలో ఉన్నట్లు సమాచారం. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.