జీడిమెట్ల : అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక ఓ కుటుంబం మూడు రోజులు మృతదేహంతో నివసించింది. ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు జరిపించారు. హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోగల షాపూర్నగర్ సమీపంలో ఎన్ఎల్బీనగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 76 ఏళ్ల స్వామిదాస్ అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్ఎల్బీ నగర్లో నివాసం ఉంటున్నాడు. ఆయన చిన్న కూతురు సలోని కుటుంబ పోషణ కోసం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో నర్స్ ఉద్యోగం చేసేది. ఈ క్రమంలో తన తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో ఉద్యోగం మానేసింది. స్వామిదాస్ ఆరోగ్య పరిస్థితి విషమించి మూడు రోజుల క్రితం మరణించాడు.
అయితే అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేవని ఆ కుటుంబం మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుని నివసించింది. మూడు రోజులుగా ఇంట్లోంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దాంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆపై స్వచ్ఛంద సంస్థ సాయంతో అంత్యక్రియలు జరిపించారు.