గోమా : రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో శనివారం ఇరగోంగో అగ్ని పర్వతం విస్పోటనం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృత్యువాతపడ్డారు. సుమారు 170 మంది పిల్లల ఆచూకీ తెలియడం లేదని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్) పేర్కొంది. అగ్నిపర్వతం నుంచి లావా ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో గోమా నగర వీధుల్లోకి చేరింది. వందల సంఖ్యలో ఇండ్లు దెబ్బతిన్నాయి. దీంతో స్థానికులంతా భయంతో సామాగ్రిని తీసుకొని నగరం విడిచి వెళ్తున్నారు. ఇప్పటి వరకు 8వేల మందికిపైగా శివారులో ఉన్న రువాండాలోకి చేరారని రువాండా అత్యవసర నిర్వహణ మంత్రిత్వశాఖ పేర్కొంది.
మరో 25,000 మందికి సేక్ ప్రాంతంలో ఆశ్రయం కావాలని యునిసెఫ్ తెలిపింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఇరగోంగో అగ్నిపర్వతం రాత్రి సమయంలో బద్దలవడంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని నార్వేజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ (ఎన్ఆర్సీ) ప్రతినిధి తెలిపారు. అగ్ని పర్వతం విస్పోటనం తర్వాత 11 మంది మృతి చెందగా.. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేస్తూ వేరే ప్రాంతానికి వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో ఐదుగురు మృతి చెందారు. క్యాంప్ మున్జెంజ్ జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన క్రమంలో నలుగురు ఖైదీలు సైతం మరణించారని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఎన్ఆర్సీ అంచనా ప్రకారం.. గోమా చుట్టూ సుమారు 600 గృహాలు, ఐదు పాఠశాలలు ధ్వంసమయ్యాయి. అగ్ని పర్వత విస్ఫోటనం కారణంగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతూ ఉండగా, గోమా నగర వీధులను లావా ముంచెత్తింది. దట్టమైన పొగ అలముకుంది. 2002లోనూ ఈ అగ్నిపర్వతం విస్పోటనం చెందిన సమయంలో 250 మంది మరణించగా.. వేలాది మంది నిరాశ్రయులై.. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.