కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 27: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొత్త ఓటర్లు పెరిగారు. ఓటర్ల జాబితా సవరణ 2024 ప్రకారం ఇప్పటివరకు 17,88,392 మంది ఓటర్లు ఉండగా, తాజాగా ఈసీ విడుదల చేసిన అనుబంధ జాబితా ప్రకారం 8,758 మంది అదనంగా చేరారు. దీంతో సెగ్మెంట్లో మొత్తం ఓటర్ల సంఖ్య 17,97,150కి పెరిగింది. వీరిలో 9,19,565 మంది మహిళలు, 8,77,483 మంది పురుషులు, 102 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. అత్యధికంగా కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 4,829 మంది, సిరిసిల్ల నియోజకవర్గంలో 1432, హుస్నాబాద్లో 1,539, హుజూరాబాద్ సెగ్మెంట్లో 1161, వేములవాడలో 865, మానకొండూర్లో 536 మంది కొత్తగా ఓటర్లు నమోదయ్యారు.
చొప్పదండి సెగ్మెంట్లో మాత్రం గత జాబితాలోని సంఖ్యకన్నా 1,604 మంది ఓటర్లు తగ్గారు. లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఈ ఏడాది ఫిబ్రవరి 8న కేంద్ర ఎన్నికల సంఘం సవరించిన ఓటర్ల తుది జాబితా విడుదల చేసింది. అనంతరం కూడా అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే మూడు రోజుల ముందు వరకు ఏప్రిల్ 15 నాటికి అవకాశం కల్పించింది. కొత్త ఓటర్లతో పాటు ఇతర ప్రాంతాల్లోని వారు తాము నివసిస్తున్న చోటనే ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు అర్హులైన వారిని గుర్తించి, ఓటర్లుగా నమోదు చేశారు.
గతంలో ఓటరు నమోదులో జరిగిన నిర్లక్ష్యంతో ఎక్కువ శాతం తప్పుల తడకగా జాబితాలు రూపొందాయి. ఓటర్ల పేర్లు, తండ్రుల పేర్లు, చిరునామాలు, వయస్సు కూడా తప్పుగా నమోదు కావడం, మరికొంత మంది పేర్లు తొలగించడంతో వేల సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఓటరు జాబితాల రూపకల్పనపై క్షేత్రస్థాయిలో అనేక విమర్శలు వచ్చాయి. దీంతో స్పందించిన ఎన్నికల సంఘం గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఓటర్ల నమోదు, తొలగింపుపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. అలాగే, కొత్త ఓటర్ల నమోదుపై కూడా దృష్టి పెట్టింది.
ఆన్లైన్, ఆఫ్లైన్లో నమోదైన దరఖాస్తులను బూత్స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి పరిశీలించిన అనంతరమే వారిని ఓటరుగా గుర్తిస్తూ, నిర్ణయం తీసుకున్నారు. పెరిగిన ఓటర్లలో వలస కూలీలతో పాటు యువత, మహిళలే అధికంగా ఉన్నారు. కొత్త ఓటర్లకు త్వరలోనే ఎన్నికల సంఘం నుంచి గుర్తింపుకార్డులు అందనున్నాయి. ఈ మేరకు తాజాగా అనుబంధ జాబితా విడుదల చేయగా, ఇందులో ఓటరుగా నమోదైన వారు మాత్రమే పార్లమెంటు ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
పెరిగిన ఓటర్ల కోసం అదనంగా పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,194 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడిస్తున్నారు. ఎన్నికల సిబ్బందిని కూడా ఈ సారి అదనంగా నియమించి, వారికి శిక్షణ ఇస్తున్నారు. సెగ్మెంట్ పరిధిలో మొత్తం 5,423మంది సిబ్బందిని ఎన్నికల విధుల కోసం వినియోగిస్తుండగా,
వీరిలో 1,279 మంది ప్రిసైడింగ్ అధికారులు, 1,304 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 2,656 మంది ఓపీవోలు, 184 మంది ఎంవోలు ఉన్నారు. 8,552 ఈవీఎంలను ఓటర్లు ఓట్లు వేసేందుకు వినియోగించనున్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి రెండో ర్యాండమైజేషన్ కూడా పూర్తి చేసి, వారిని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కేటాయించారు. నాలుగు రోజుల క్రితమే ఈవీఎంలను అసెంబ్లీ నియోజకవర్గాలకు తరలించి, స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు.