కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ వ్యాప్తంగా భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో 385 మంది తాలిబాన్ ఉగ్రవాదులు మరణించారని, 210 మంది గాయపడ్డారని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. 24 గంటల్లో నంగర్హార్, లోగర్, గజనీ, పక్తికా, మైదాన్ వార్తక్లో ఆఫ్ఘన్ జాతీయ రక్షణ భద్రతా దళాలు (ఏఎన్డీఎస్ఎఫ్) నిర్వహించిన భద్రతా కార్యకలాపాలను రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఫవాద్ అమన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాందహార్, హెరాత్, ఫరా, జౌజ్జాన్, సమంగాన్, హెల్మాండ్, తఖర్, బాగ్లాన్, కపిసా, ఫైజ్-అబాద్ నగరం, బడాఖాన్ ప్రావిన్షియల్ సెంటర్, తఖర్ ప్రావిన్షియల్ రాజధాని తాలిఖాన్ సిటీపై తాలిబాన్ల దాడులను భద్రతా బలగాలు అడ్డుకున్నాయని పేర్కొన్నారు.
నాంగర్హార్, లోగర్, గజనీ, పక్తికా, మైదాన్ వార్దక్, కాందహార్, హెరాత్, ఫరా, జౌజ్జాన్, సమంగాన్, హెల్మాండ్, తఖర్, బాగ్లాన్ కపిసా ప్రావిన్సుల్లో 385 తాలిబాన్ ఉగ్రవాదులు మరణించారని, 210 మంది గాయపడ్డారని ట్వీట్ చేశారు. ఆఫ్ఘన్ దళాలు కుందుజ్ ప్రావిన్షియల్ సెంటర్ శివారులోని తాలిబాన్ల దాక్కున ప్రదేశాలను సైతం లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడి జరుపడంతో తాలిబాన్ ఉగ్రవాదులకు భారీ నష్టం జరిగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత కొద్ది వారాల్లో తాలిబాన్లు పౌరులు, ఆఫ్ఘన్ భద్రతా దళాలపై తమ దాడిని తీవ్రతరం చేయడంతో ఆఫ్ఘనిస్తాన్లో హింస పెరిగింది.
ప్రాంతీయ ప్రభుత్వ అధికారుల బంధువులు, పోలీసులు, సైన్య సభ్యులతో సహా కొంతమంది ఖైదీలను తాలిబాన్లు చంపినట్లు సమాచారం. 2021 ప్రథమార్ధంలో ఆఫ్ఘనిస్తాన్లో పౌరుల మరణాలు రికార్డు స్థాయికి చేరాయి. 1,659 మంది మరణించగా.. 3,254 మంది గాయపడ్డారు. మే నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి విదేశీ దళాలను ఉపసంహరించుకోవడంతో హింస పెరుగుతోంది. ఇటీవల ఆ దేశ రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లా మహమ్మదీ ఇంటిపై బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. అధికారులపై తమ దాడులు కొనసాగుతాయని తాలిబాన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఇటీవల హెచ్చరించారు.