శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లోని బుద్గాం ఉగ్రవాదులు, భద్రతా దళాల ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ సందర్భంగా ఉగ్రవాది నుంచి ఏకే 47 రైఫిల్, పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారు జామున రాజౌరి జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. భదత్రా దళాలు సాంబా జిల్లాలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి.
నిఘావర్గాల సమాచారం ఆధారంగా సర్థియాన్ గ్రామంలో పోలీసులు, సైన్యం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.. ఈ సమయంలో రెండు పిస్టల్స్, ఐదు మ్యాగజైన్లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారని అధికారులు పేర్కొన్నారు. పూంచ్ బాల్నోయల్ ప్రాంతంలో నిర్వహించిన ఆపరేషన్లో భద్రతా దళాలకు రెండు వైర్లెస్ కమ్యూనికేషన్ సెట్లు, అనేక బ్యాటరీలు, టార్చ్లు సైతం లభించాయని అధికారులు తెలిపారు.