న్యూఢిల్లీ: అబుదాబిలో నివసిస్తున్న 29 ఏళ్ల అనిల్కుమార్ బొల్లా అనే ఏపీ యువకుడు యూఏఈ లాటరీ చరిత్రలోనే అతి పెద్దదైన 100 మిలియన్ దిర్హామ్లు (సుమారు రూ. 240 కోట్లకు పైగా) జాక్పాట్ను గెలుచుకున్నాడు! అక్టోబరు 18న జరిగిన 23వ లక్కీ డే డ్రాలో అనిల్కుమార్ ఈ బహుమతిని గెలుచుకున్నట్టు లాటరీ నిర్వాహకులు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన విజయం గురించి అనిల్కుమార్ మాట్లాడుతూ.. తాను ప్రత్యేకంగా మ్యాజిక్ ఏమీ చేయలేదని, ‘ఈజీ పిక్’ ద్వారా టికెట్ను ఎంచుకున్నానని తెలిపాడు. కానీ ఆ టికెట్లోని చివరి నంబర్ చాలా ప్రత్యేకమని, అది తన తల్లి పుట్టిన రోజు అని చెప్పాడు. గెలిచిన విషయం తెలియగానే, తాను సోఫాలో కూర్చుని షాక్లో ఉండిపోయానని తన ఆనందాన్ని పంచుకున్నాడు.
పెద్ద మొత్తంలో డబ్బు రావడంతో, ఆ డబ్బును బాధ్యతాయుతంగా ఖర్చు చేయాలని, సరైన మార్గంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్టు చెప్పాడు. తాను పెద్ద మొత్తాన్ని గెలిచానని, ఇప్పుడు సరైన మార్గంలో ఆలోచించి మంచి పని చేయాలనుకుంటున్నానని అన్నాడు. అనిల్కుమార్ అతిపెద్ద కోరిక ఏంటంటే, తన కుటుంబాన్ని యూఏఈకి తీసుకువచ్చి, వారి వెంట ఉంటూ సంతోషంగా జీవితాన్ని గడపడం. గెలుచుకున్న మొత్తంలో కొంత భాగాన్ని దానం చేయాలని కూడా ఆయన నిర్ణయించుకున్నాడు.
సరదాగా ఒక సూపర్ కార్ కొని, ఒక లగ్జరీ రిసార్ట్ లేదా సెవెన్ స్టార్ హోటల్లో సెలబ్రేట్ చేసుకోవాలని కూడా ఆయన ఉవ్విళ్లూరుతున్నాడు. ‘ప్రతిదీ ఒక కారణం కోసమే జరుగుతుందని నేను నమ్ముతాను. ప్రతీ ఒక్కరూ ఆడుతూ ఉండండి, కచ్చితంగా ఒక రోజు అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది’ అని తోటి లాటరీ ఆటగాళ్లకు సందేశం ఇచ్చాడు. ఈ అద్భుతమైన అవకాశాన్ని కల్పించినందుకు యూఏఈ లాటరీకి ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.