రాష్ట్ర ప్రభుత్వం కొలువులను భర్తీ చేయనున్న నేపథ్యంలో జిల్లాల వారీగా విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను పంపించాలని ఆదేశించింది. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను విద్యాశాఖ నివేదించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వివిధ కేటగిరీల్లో 1650 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు శనివారం పంపించింది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువతలో సంతోషం వ్యక్తమవుతున్నది. కాగా, ఉపాధ్యాయ నియామక పరీక్షకు ముందు నిర్వహించే టెట్పై వారం పది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.
కరీంనగర్, మార్చి 19 (నమస్తే తెలంగాణ)/కమాన్చౌరస్తా : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో పెద్దఎత్తున ఉద్యోగాల నియామకాలు చేపడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు అన్ని శాఖల మాదిరిగానే విద్యా శాఖలోనూ ప్రభుత్వం ఖాళీలను గుర్తించింది. జిల్లా విద్యాశాఖ అధికారులు శనివారం తుది నివేదికను అందించారు. జిల్లాల విభజన చేపట్టిన తర్వాత ఉపాధ్యాయుల పోస్టులను జిల్లాలు, జోన్ల వారీగా కేటాయింపులు జరిపారు. ఆ తర్వాత ఏర్పాడిన ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నారు. విభజన తర్వాత కరీంనగర్ జిల్లాలో విద్యాశాఖలో నాలుగో తరగతి ఉద్యోగులను మినహాయిస్తే 3,153 ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ఇందులో 2,675 పోస్టుల్లో ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. 478 పోస్టులు వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో మొత్తం 3,922 పోస్టులు ఉండగా, 3,256 మంది పనిచేస్తున్నారు. 666 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం పోస్టులు 2,352 ఉండగా, ప్రస్తుతం 2014 మంది పని చేస్తున్నారు. 338 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 2,377 పోస్టులు ఉన్నాయి. ఇందులో 2,209 మంది పని చేస్తుండగా, 168 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జిల్లాలో 95 శాతం పోస్టులు స్థానికులకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయ పోస్టులు కూడా జిల్లా క్యాడర్ పరిధిలోనే ఉన్నాయి. విద్యా శాఖలో ఎక్కువగా ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గెజిటెడ్ హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సబ్జెక్టుల వారీగా పెద్ద మొత్తంలోనే ఖాళీగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ ప్రకటనతో ఎలాగైనా ఈ పోస్టులను దక్కించుకోవాలని తపనతో నిరుద్యోగులు కనిపిస్తున్నారు. బీఈడీ పూర్తి చేసి ఇప్పటికే టెట్లో అర్హత సాధించిన వాళ్లు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్లు నేరుగా నియామక పరీక్షలకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే విద్యా శాఖలోని పోస్టులు, ఖాళీల వివరాలను కమిషనరేట్ తీసుకోవడంతో త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని నిరుద్యోగుల్లో ఆశలు కలుగుతున్నాయి.