ముంబై: వచ్చే నెలలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్ ( T20 World Cup ) కోసం 15 మంది సభ్యుల టీమిండియాను ఇప్పటికే సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఆ టీమ్ను అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 10లోపు తమ 15 మంది సభ్యుల జట్లను అన్ని బోర్డులు ప్రకటించాల్సి ఉంది. దీంతో రానున్న 24 గంటల్లో ఇండియన్ టీమ్ను బోర్డు ప్రకటించనుంది. ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ ముగిసిన తర్వాత బోర్డు జట్టులోని సభ్యుల పేర్లు వెల్లడించనున్నదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఒకవేళ మ్యాచ్ త్వరగా ముగిస్తే.. సోమవారమే ప్రకటించే అవకాశం ఉంది.
అయితే ఈ టీమ్లో పెద్దగా ఆశ్చర్యకర నిర్ణయాలేవీ లేకపోవచ్చు. చాలా వరకూ స్థానాలను ముందుగా ఊహించిన సభ్యులే భర్తీ చేయనున్నారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా దాదాపు ఖాయమైనట్లే. మూడో ఓపెనర్ స్థానం కోసం పృథ్వి షా, ధావన్ మధ్య పోటీ ఉంటుంది. మిడిలార్డర్లో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ ఉంటారు. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కుతుందా లేదా చూడాలి. బౌలింగ్లో బుమ్రా, భువనేశ్వర్, దీపక్ చహర్, యజువేంద్ర చాహల్.. ఆల్రౌండర్లలో జడేజా, పాండ్యా బ్రదర్స్ దాదాపు తమ స్థానాలను ఖాయం చేసుకుంటారు. టీ20 వరల్డ్కప్లో భాగంగా అక్టోబర్ 24న పాకిస్థాన్తో మ్యాచ్తో టీమిండియా వేట మొదలుపెట్టనుంది.