సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఈవీ వినియోగానికి పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్-రెడో కృషి చేస్తోందని చైర్మన్ సతీశ్రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేలా వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగా 138 ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నామని, హైదరాబాద్లో 118, వరంగల్లో 10, కరీంనగర్లో 10 ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన చెప్పారు. వాహన చార్జర్ల కొనుగోలు కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని సతీశ్రెడ్డి తెలిపారు.
ప్రభుత్వ రంగ సంస్థల స్థలాల్లో రెవెన్యూ షేరింగ్ విధానంలో, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో చార్జింగ్ కేంద్రాలు నెలకొల్పనున్నట్లు చెప్పారు. చార్జింగ్ కేంద్రాల కోసం అనువైన స్థలాల జాబితా ఇప్పటికే హెచ్ఎండీఏ, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్పీడీసీఎల్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్టీసీ, టూరిజం శాఖ, పౌరసరఫరాల శాఖ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, రోడ్డు, రవాణాశాఖలు.. తెలంగాణ రెన్యూయెబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అందజేశాయని తెలిపారు. ఇందులో భాగంగా 979 ప్రాంతాల వివరాలు వివిధ శాఖల నుంచి రెడోకు అందాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, టూరిజం శాఖ ఇచ్చిన ప్రాంతాలను రెడో ఆధీనంలోకి తీసుకున్నదని… హెచ్ఎండీఏ, పౌరసరఫరాల శాఖతో రెవెన్యూ షేరింగ్ ఒప్పంద ప్రయత్నాలు జరుగుతున్నాయని రెడో చైర్మన్ వై.సతీశ్రెడ్డి వివరించారు.
అక్టోబర్ మొదటివారంలో యాప్
ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాల ఏర్పాటు కోసం 20 మంది ఆపరేటర్లు ఎంపానల్ అయినట్టు సతీశ్రెడ్డి వెల్లడించారు. మరింత మంది ఆపరేటర్లు ముందుకు రావాలని ఆయన కోరారు. ఎలక్ట్రిక్ టూవీలర్ సూటర్ల తయారీదారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 18 బ్రాండ్లు ఎంపానల్ చేయబడినట్టు చెప్పారు. మరింత మంది ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీదారులకు సహకారమందించేందుకు రెడో సిద్ధంగా ఉందన్నారు. తయారీదారులకు నెల వారీ చెల్లింపుల లెకన తకువ వడ్డీకే రుణాలిచ్చేందుకు పలు బ్యాంకులు ముందుకొచ్చినట్లు చెప్పారు. ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలకు ప్రాచుర్యం కల్పించేందుకు తెలంగాణ రెన్యూయెబుల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో వెబ్, మొబైల్ (ఆండ్రాయిడ్, ఐవోఎస్) యాప్ తయారు చేస్తోందని చైర్మన్ వై.సతీశ్ రెడ్డి వెల్లడించారు. ఇది అక్టోబర్ మొదటి వారంలో అందుబాటులోకి వస్తుందన్నారు. దీని ద్వారా రుణాలు పొందడంతోపాటు, ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ కేంద్రాలను మానిటరింగ్ చేసే వీలుందన్నారు.
5000 ఆటోల్లో..
పాత డీజిల్ ఆటోలు, బస్సుల్లో మార్పులు చేసి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సతీశ్ రెడ్డి అన్నారు. మొత్తం 5000 ఆటోల్లో మార్చుకోవడానికి వీలైన బ్యాటరీలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రాథమికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 500 ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకో ఆటోకు రూ.15,000 సబ్సిడీ ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆర్టీసీ డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు త్వరలోనే టెండర్లు పిలువనున్నట్టు తెలిపారు. ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్ రోడ్ షో ఎగ్జిబిషన్’ రెండో విడతను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.