సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): నడుకుచుకుంటూ వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని మొబైల్స్ను దొంగిలిస్తూ, ఆ ఫోన్లను సూడాన్ దేశానికి తరలిస్తున్న స్థానిక దొంగలతో పాటు అంతర్జాతీయ దొంగలను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 17 మంది ముఠా సభ్యులతో పాటు వారి నుంచి 703 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి కేసుకు సంబంధించిన వివరాలను బషీర్బాగ్లోని ఓల్డ్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తాడ్బన్కు చెందిన మహ్మద్ ముజమిల్ అలియాస్ ముజ్జు మండపాల డెకరేషన్ వర్క్ చేస్తుంటాడు.
ఇతని స్నేహితుడు జహునామకు చెందిన సయ్యద్ అబ్రార్ డ్రైవర్. ఇద్దరూ కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఎల్బీనగర్లో ఒక పల్సర్ బైక్ను దొంగిలించారు. బైక్పై రాత్రి వేళల్లో పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే వారి వద్ద నుంచి సెల్ఫోన్లు దొంగిలించారు. దొంగిలించిన ఫోన్లను మహ్మద్ సలీంకు అందజేస్తారు. ఈ ఫోన్లకు మంచి డిమాండ్ ఉండటంతో పతాన్ రబ్బాని ఖాన్, మహ్మద్ అత్తార్, మహ్మద్ జకీర్, షేక్ అజార్, మహ్మద్ ఖాజా నజీముద్దీన్, సయ్యద్ లాయఖ్, షేక్ అజార్ మొహినుద్దీన్, మహ్మద్ షఫీ, యలమందారెడ్డిలతో ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నారు. అలాగే సూడాన్ దేశానికి చెందిన ఖలీద్ అదెనబాగి మహ్మద్ అల్బద్వి మాసబ్ ట్యాంకులో సెల్ఫోన్ బిజెనెస్ చేస్తుండగా, అబదాలా అహ్మద్ ఉస్మాన్ బాబికర్ బట్టల వ్యాపారం చేస్తున్నాడు.
అలాగే మరో ముగ్గురు సూడాన్ నుంచి విద్యార్థి వీసాపై ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు. ఈ క్రమంలో అబిడ్స్ జగదీష్ మార్కెట్లో సూడాన్ దేశస్తులకు, ముజ్జు గ్యాంగ్తో పరిచయం ఏర్పడింది. దీంతో ముజ్జు గ్యాంగ్ ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దొంగిలించిన సెల్ఫోన్లను సూడాన్ దేశస్తులకు విక్రయిస్తున్నారు. ఇలా సెల్ఫోన్లు కొని సముద్ర మార్గంలో కంటైనర్లలో సూడాన్ దేశానికి తరలిస్తున్నారు. అక్కడ ఈ ఫోన్లను ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ గ్యాంగ్ను పట్టుకున్నామని సీపీ తెలిపారు. అరెస్టు అయిన 17 మందిలో 12 మంది హైదరాబాద్కు చెందిన వారు కాగా మిగతా ఐదుగురు సూడాన్ దేశానికి చెందిన వారని పేర్కొన్నారు.