బాన్సువాడ టౌన్/బాన్సువాడ, సెప్టెంబర్ 21: మన రాష్ర్టానికి పాలనాదక్షత గల నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఇందుకు మనమందరం సంతోషించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులు మంచి చేస్తేనే ప్రజలు బ్రహ్మరథం పడతారని, లేదంటే వారే తరిమి కొడతారని పేర్కొన్నారు. బాన్సువాడ పట్టణంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో బీర్కూర్ మండలంలోని అభివృద్ధి పనులు, సంక్షేమంపై ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తానే బరిలో ఉంటున్నట్లు ముందుగా స్పష్టంచేశారు. మన పరిధిలో జరుగుతున్న అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో పరిశీలన అవసరమని, అప్పుడే మన తప్పొప్పులు, లోటుపాట్లు బయటపడతాయని హితవు పలికారు.
గ్రామస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసుకొని సమన్వయంతో పనిచేస్తే మనస్పర్థలకు తావుండదన్నారు. ఏకపక్ష నిర్ణయాలు సరికాదని, ఎవరు తప్పుచేసినా అది ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుందన్నారు. ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని, ప్రతిపక్షాల విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలన్నారు. నాయకులు, ప్రజాప్రతినిధులకు తన కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మండలంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అభివృద్ధిలో బాన్సువాడ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఇందుకోసం కావలసినన్ని నిధులు మంజూరుచేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సురేందర్రెడ్డి, బీర్కూర్ ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, జడ్పీటీసీ స్వరూప, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, ఎంపీటీపీ సందీప్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లాడేగాం వీరేశం, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమపథకాలతోనే అన్నదాతల బతుకులు బాగుపడ్డాయని, రాష్ట్రంలోని రైతులు రాజులయ్యారని స్పీకర్ పోచారం అన్నారు. బాన్సువాడ మార్కెట్ కమిటీ ఆవరణలో నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్ నెర్రె నర్సింహులు, వైస్ చైర్మన్ రాజశేఖర్తోపాటు పాలకవర్గ సభ్యులను స్పీకర్ అభినందించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిధులు లేక ఏఎంసీల పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పుష్కలంగా నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు.
ప్రతి మార్కెట్ కమిటీకి నూతన భవనాలు, గోదాములు, కోల్డ్ స్టోరేజీలు నిర్మించినట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు నాటికి 30.47 మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే, ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న ప్రోత్సాహంతో 2021 నాటికి 1.23 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. సాగువిస్తీర్ణం 190 శాతం పెరిగి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లనుంచి కేంద్రం తప్పుకోవాలని చూస్తున్నదనే వార్తలు విచారకరం అన్నారు. కరెంటు మోటర్లకు మీటర్లు పెట్టాలని కేంద్రం కోరుతున్నదని, కానీ ముఖ్యమంత్రి ఇందుకు ఒప్పుకోలేదని తెలిపారు. కార్యక్రమంలో బల్దియా చైర్మన్ గంగాధర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీల చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.