పంచనారసింహుడిగా తానై అవతరించిన దివ్య యాదాద్రిపై పునరావిర్భావం చెందబోతున్నాడు. 2022 మార్చి 28న ఉత్తరాయణ పుణ్యకాలాన స్వామివారు తన భక్తావళికి దివ్యదర్శనం ప్రసాదించనున్నారు. దీంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న భక్తకోటికి మూలవరుల దివ్యరూప పునర్దర్శనం జరుగబోతున్నది. అపూర్వ నిర్మాణంతో ఇలలోనే వైకుంఠనగరాన్ని తలపిస్తున్న యాదాద్రిని నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం స్వామివారి సన్నిధిలో ముహూర్తాన్ని ప్రకటించారు.
అద్భుతమైన శిల్ప సౌరభాలతో తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మించింది. అడుగడుగునా ఆధ్యాత్మికత ఉట్టి పడే కట్టడాలు..ఒద్దికగా పొదిగిన అందమైన కృష్ణరాతి శిలలు.. రాజసంగా కొలువుదీరిన సప్తరాజ గోపురాలు.. గర్భగుడి ముఖద్వారం, ధ్వజ స్తంభానికి బంగారు తొడుగులు.. ఇలా ప్రతి అంగుళం భక్తులు తన్మయత్వం చెందేలా, భక్తిభావం ఉప్పొంగేలా తీర్చిదిద్దిన ఆలయం అందరినీ ఆకట్టుకుంటున్నది.