వేసవి కాలం ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు సమస్త జీవజాలం అల్లాడుతోంది. మనుషులైతే కనీసం ఇళ్లలో, ఏసీ గదుల్లో సేద తీరుతున్నారు. మరి జంతువుల మాటేమిటి? అవి ఎండకు అల్లాడిపోవాల్సిందేనా? మధ్యప్రదేశ్లోని ఒక జూ అధికారులు ఇలా జంతువులు ఎండకు పడే బాధలు చూడలేపోయారు. అందుకే తమ జూలో కూలర్లు, ఏసీలు, స్ప్రింకర్లు అమర్చారు.
ఇదంతా ఇండోర్లోని కమలా నెహ్రూ జువాలాజికల్ గార్డెన్ అధికారుల చొరవే. భయంకరంగా పెరుగుతున్న వేడికి జంతువులు ఇబ్బందులు పడకూడదనే ఈ ఏర్పాట్లు చేశామని జూ ఇన్చార్జి డాక్టర్ ఉత్తమ్ యాదవ్ తెలిపారు. ‘‘పులులు, సింహాలు, చిరుతల కోసం నీటి తొట్టెలు, కూలర్లు ఏర్పాటు చేశాం. దీంతోపాటు పైపుల్లో నీళ్లను పంపి స్ప్రింక్లర్లతో చల్లుతున్నాం.
కోతులు, ఇతర జంతువులకు కూడా ఇలాంటి ఏర్పాట్లే చేశాం. పక్షులపై వస్త్రాలు కప్పి ఎండ నుంచి కాపాడుతున్నాం. దుప్పెల కోసం కూడా స్ప్రింక్లర్లు, నీటి తొట్టెలు, బురద అందుబాటులో ఉంచాం’’ అని ఆయన వివరించారు.