న్యూఢిల్లీ: పరువు నష్టం కేసు వేస్తానంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ మండిపడ్డారు. తనపై, తన కుటుంబంపై ఆయన చేసిన ఆరోపణలను ఖండించారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మీడియాతో శనివారం మాట్లాడారు. 2020లో దేశం కరోనాతో పోరాడుతున్నప్పుడు అస్సాం ఆరోగ్య మంత్రిగా ఉన్న బీజేపీ నేత హిమంత బిస్వా శర్మ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన భార్య, కుమారుడు భాగస్వాములుగా ఉన్న సంస్థ నుంచి పీపీఈ కిట్లను మార్కెట్ రేట్ (రూ.600) కంటే అధికంగా రూ.990కు కొనుగోలు చేశారని విమర్శించారు.
హిమంత బిస్వా శర్మ అత్యవసర పరిస్థితిని సద్వినియోగం చేసుకుని అవినీతికి పాల్పడ్డారని మనీష్ సిసోడియా ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. ‘అవినీతి ఆరోపణలున్న ఇద్దరు నేతలపై చర్యలు తీసుకునే ధైర్యం బీజేపీకి ఉందా? లేక కల్పిత కేసులతో మా నేతల వెంట పడతారా?’ అని ప్రశ్నించారు. రెండు రోజుల కిందట ‘ది వైర్’లో వచ్చిన ఒక దర్యాప్తు వార్తా కథనం ఆధారంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చేసిన ఈ అవినీతి ఆరోపణలను అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఖండించారు. దేశం కరోనాను ఎదుర్కొంటున్న సమయంలో అస్సాంలో ఎలాంటి పీపీఈ కిట్లు లేవన్నారు. తన భార్య ధైర్యంగా ముందుకు వచ్చి 1500 పీపీఈ కిట్లను ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చిందని చెప్పారు. దాని కోసం ఒక్క రూపాయి కూడా ఆమె తీసుకోలేదని ట్వీట్ చేశారు. ‘లేనిపోని నిందలు ఆపకపోతే పరువు నష్టం నేరం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడు నిన్ను గౌహతిలో చూస్తాను’ అని మనీష్ సిసోడియాను మరో ట్వీట్లో హెచ్చరించారు.
Stop sermonising and I will see you soon in Guwahati as you will face criminal defamation.
— Himanta Biswa Sarma (@himantabiswa) June 4, 2022