కోల్కతా : అసెంబ్లీ ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్కు తృణమూల్ కాంగ్రెస్ నుంచి విముక్తి లభిస్తుందని యూపీ సీఎం, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ యోగి ఆదిత్యానాథ్ అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి మంగళవారం జల్పాయిగురిలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు.
టీఎంసీ గూండాలను కాపాడేందుకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రయత్నించినా తృణమూల్ గూండాలను జైలుకు పంపడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఇక కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా బెంగాల్లో మంగళవారం సింగూర్, దోంజూర్, హౌరా, బెహలా పుర్బా ప్రాంతాల్లో నాలుగు రోడ్షోలను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 294 అసెంబ్లీ స్ధానాలున్న బెంగాల్లో ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుండగా ఇప్పటివరకూ మూడు దశల పోలింగ్ పూర్తయింది.