(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): ఉత్తర ప్రదేశ్లోని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న వందలాది మంది టీచర్లకు గత ఏడాదిగా యోగీ సర్కార్ జీతాలు చెల్లించకపోవడంతో నిరహార దీక్షలకు దిగారు. లక్నోలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ క్యాంపస్లో గత పదిహేను రోజులుగా ఎయిడెడ్ టీచర్ల నిరాహార దీక్షలు చేస్తున్నా, యోగీ సర్కార్ స్పందించటం లేదని ఎయిడెడ్ టీచర్ల యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 14 జిల్లాల్లో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న 1471 మంది తాత్కాలిక టీచర్లకు జీతాలు రాకపోవడంతో వారి జీవితాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి.
అనారోగ్యానికి గురైన తన కుమార్తెకు అయోధ్యలోని ఓ టీచర్ వైద్యం చేయించలేక పోయాడని, దాంతో ఆ అమ్మాయి మరణించిందని ఉద్యోగ సంఘాల నాయకుడు త్రిపాఠి చెప్పారు. పెండింగ్ జీతాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చుకుని జీవనం సాగిస్తున్నామని, 22 ఏండ్లుగా పనిచేస్తున్నా పర్మినెంట్ చేయటం లేదని అన్నారు.