Yogi Adityanath : భారత్లో భిన్నత్వాన్ని కించపరిచేలా కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ భగ్గుమన్నారు. పిట్రోడా వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన గురువారం డిమాండ్ చేశారు. పిట్రోడా వ్యాఖ్యలకు కాంగ్రెస్ బాధ్యత వహించాలని ఓ వార్తాసంస్ధతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు.
సామ్ పిట్రోడా కాంగ్రెస్ బుద్ధిజీవి అని, ఆయన ఆ పార్టీ విభజించి, పాలించు విధానాన్ని తన వ్యాఖ్యల ద్వారా వెల్లడించారని విమర్శించారు. దేశ విభజనకు కూడా కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని అన్నారు. దేశానికి స్వతంత్రం లభించిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని కులం, మతం, ప్రాంతం పేరుతో వేరు చేసిందని యోగి ఆదిత్యానాథ్ దుయ్యబట్టారు. సామ్ పిట్రోడా ప్రకటన ఖండనార్హమని, కాంగ్రెస్ ఆలోచనా ధోరణి దేశానికి ప్రమాదకరమని అన్నారు.
చర్మం రంగు ఆధారంగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఉత్తరాది, దక్షిణాది, తూర్పు, పశ్చిమగా విభజించేందుకు ప్రయత్నిస్తోందని యూపీ సీఎం దుయ్యబట్టారు. సామ్ పిట్రోడా ప్రకటన సిగ్గుచేటని అన్నారు. భారత్లో భిన్నత్వాన్ని సామ్ పిట్రోడా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ దక్షిణాది వారు ఆఫ్రికన్లలా ఉంటారని, ఈశాన్య ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ ప్రాంత వాసులు అరబ్బుల్లా కనిపిస్తారని చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.
Read More :
Flax Seeds | అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు.. అందమూ మీ సొంతం!