UP Polls : సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ శ్రీకృష్ణుడి వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ స్పందించారు. అధికారంలో ఉన్న సమయంలో మధుర, బృందావన్, గోకుల్లను పట్టించుకోని వారిని కృష్ణుడు నిందిస్తాడని ఎస్పీ చీఫ్ను ఉద్దేశించి యోగి వ్యాఖ్యానించారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ గెలుపొంది రాష్ట్రంలో రామరాజ్యం ఏర్పాటు చేస్తారని శ్రీకృష్ణుడు రోజూ తనకు కలలో కనపడి చెబుతుంటారని అఖిలేష్ పేర్కొన్న క్రమంలో యోగి ఆదిత్యానాధ్ అలీఘఢ్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వారు (అఖిలేష్ యాదవ్) కృష్ణుడు కలలోకి వచ్చి తాము అధికారంలోకి వస్తామని చెప్పాడని చెప్పుకుంటున్నారని కానీ వారు అధికారంలో ఉండగా ఘర్షణలను ప్రేరేపించారని, ఉగ్రవాదులను విడుదల చేశారని యోగి మండిపడ్డారు.
తాము రామ మందిరం నిర్మిస్తున్నామని, ఇప్పుడు వారు కనీసం క్షమాపణ కోరాలని అన్నారు. గత ప్రభుత్వాల్లో ఉగ్ర దాడులు జరిగాయని కల్లోల పరిస్ధితులు నెలకొన్నాయని గుర్తుచేశారు. గత పాలకుల హయాంలో ఉగ్రవాదులు, నేరగాళ్లు సీఎం నివాసానికి వెళ్లేవారని, వారిని గౌరవించే పరిస్ధితులు ఉండేవని..కానీ ప్రస్తుతం నేరగాళ్లు కూరగాయలు అమ్ముకుంటున్నారని యోగి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఉగ్రవాదులపై కేసులు ఉపసంహరిస్తే తమ ప్రభుత్వం వారిపై తూటాలను ఎక్కుపెడుతోందని అన్నారు.