న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రెజ్లర్లు (Wrestlers) తాము నిరసనల నుంచి వెనుతిరగలేదని స్పష్టం చేశారు. రెజ్లర్లు నిరసనలను విరమించారనే వార్తలు అవాస్తవమని, తాము రాజీపడలేదని, వెనక్కి తగ్గలేదని రెజ్లర్ సత్యవ్రత్ కదియన్ పేర్కొన్నారు.
నిరసనలను నిర్వీర్యం చేసేందుకు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ప్రముఖ రెజ్లర్ సాక్షి మాలిక్ భర్త కదియన్ అన్నారు. తాము నిరసనల నుంచి వెనక్కిమళ్లలేదని, తామంతా న్యాయం కోసం ఐక్యంగా పోరాడుతున్నామని తేల్చిచెప్పారు. తమను బలహీనపరిచేందుకు అసత్యాలను ప్రచారం చేస్తున్నారని స్టార్ రెజ్లర్ మండిపడ్డారు.
ఢిల్లీ పోలీసుల తీరును దేశం యావత్తూ తప్పుపడుతోందని అన్నారు. రెజ్లర్లు వెనక్కితగ్గలేదని, తాము ఉద్యమం విరమించామనే ప్రచారం వదంతేనని అంతకుముందు భజరంగ్ పునియా ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ఇక రెజ్లర్లు ఆందోళన విరమించారని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మరో రెజ్లర్ వినేష్ పొఘట్ ట్వీట్ చేశారు.
Read More