సియోని: తునికాకు సేకరణ కోసం భర్త, గ్రామస్తులతో కలిసి వెళ్లిన ఓ మహిళపై చిరుతపులి దాడిచేసి చంపేసింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం సియోని జిల్లా కియోలరీ బ్లాక్ రతన్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రతన్పూర్ గ్రామానికి చెందని 45 ఏండ్ల మహిళ తన భర్తతోపాటు మరికొందరు గ్రామస్తులతో కలిసి తునికాకు సేకరణ కోసం సమీప అడవిలోకి వెళ్లింది.
అక్కడ తునికాకు సేకరిస్తుండగా సదరు మహిళపై చిరుతపులి దాడిచేసింది. అంతేగాక ఆమెను అర కిలోమీటర్ దూరం లాక్కెళ్లి చంపేసింది. ముందుగా మహిళ అరుపులు విని అటుగా పరుగుతీసిన తన భర్త, గ్రామస్తులకు ఆమె కనిపించలేదు. కానీ ఘటనా ప్రాంతంలో రక్తం అంటిన మొబైల్ ఫోన్ మాత్రమే లభ్యమైంది. దాంతో అందరూ కలిసి చుట్టుపక్కల వెతుకగా అర కిలోమీటర్ దూరంలో రక్తపు మడుగులో మహిళ మృతదేహం లభ్యమైంది.