సిద్దిపేట, ఆగస్టు 8( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లా అకెనపల్లి పెద్దవాగులో ఇసుక అక్రమ రవాణాపై మీడియాలో ప్రచురితమైన వరుస కథనాలు అధికార యంత్రాంగంలో కదలికన తెచ్చాయి. ప్రధానంగా ఈనెల 4న ‘మామూళ్లు ఇచ్చుకో .. ఇసుక తోడేసుకో’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంతో అధికారుల్లో వణుకు పుట్టింది. అక్కెనపల్లి పెద్దవాగు పరీవాహక ప్రాంతంలో రాత్రింబవళ్లు ఇసుక తరలింపుపై వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సంబంధిత శాఖలు అప్రమత్తమయ్యాయి. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలకు చెందిన అధికారులు వాగు పరీవాహక ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
‘ నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం ఆధారంగా ఇసుక అక్రమ రవాణాలో అధికారుల పాత్రపై ఇంటలిజెన్స్ అధికారులు ఆరాతీస్తున్నట్లు తెలిసింది. ఎవరి వద్ద నుంచి ఎంతెంత డబ్బులు వసూలు చేశారు. అందులో ఎవరికి ఎంత ముట్టాయి అనే తదితర వివరాలపై లోతుగా విచారణ చేస్తున్నట్టు సమాచారం. సిద్దిపేట ఆర్డీవో, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఇసుక అక్రమ అక్రమ రవాణాపై గట్టి చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటి వరకు పట్టించుకోలేదన్న విమర్శల మధ్య అధికారుల నిఘా ప్రారంభం కావడం కొంత ఊరటనిచ్చే పరిణామమే అయినా.. ఇది కేవలం వాగులో తిరిగే ట్రాక్టర్లను గమనించడంతోనే ముగుస్తుందా…? లేక ఇసుక అక్రమ దందాతో వ్యవసాయ క్షేత్రాల వద్ద, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఇసుక డంపులపై కూడా కొరడా ఝళిపిస్తారా…? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
పెద్దవాగు పరీవాహక ప్రాంతంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఇసుక డంపులు ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. వాగు నుంచి ఇసుకను తరలించి ఎకడో ఒకచోట నిల్వ చేసి, అవసరమైన సమయంలో వాహనాల ద్వారా తరలిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారులు ఇప్పుడు వాగు వద్ద నిఘా పెట్టడం ఒక అంశమైతే, ఇప్పటికే నిల్వ చేసిన ఇసుక డంపులపై తనిఖీలు నిర్వహించడం మరో కీలక అంశంగా మారింది.
సిద్దిపేట కలెక్టర్ ఆదేశాలతో మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల్లో కదలిక రావడం మంచి పరిణామమే. అయితే ఈ నిఘా ఒకటి రెండు రోజులకు పరిమితం కాకుండా నిరంతరం కొనసాగుతుందా…? అన్నది చూడాలి. వాగులో ఇసుక తవ్వకాలు మాత్రమే కాకుండా పరీవాహక ప్రాంతంలో ఉన్నట్లు చెబుతున్న డంపులపైన అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎకడెకడ ఇసుక నిల్వ చేశారు..? ఆ ఇసుకకు లెకలు ఉన్నాయి..? అనుమతులు ఉన్నాయా..? అనే దానిపైనా అధికారులు దృష్టి పెట్టాలి. వాగు వద్ద నిఘా ఉన్నా, డంపుల నుంచి ఇసుక బయటకు వెళ్తూనే ఉంటే చర్యల అసలు ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది.
వాగులోకి వెళ్లే ట్రాక్టర్లపై నిఘా పెట్టడం అవసరమే. కానీ, అక్రమ ఇసుక రవాణా వెనుక ఉన్న మొత్తం వ్యవస్థను అరికట్టాలంటే వాగు నుంచి డంప్యార్డుల వరకు, అకడి నుంచి వినియోగ దారుల వరకు పూర్తి స్థాయిలో తనిఖీలు జరగాల్సిన అవసరం ఉందని స్థానికులు అంటున్నారు. వాగు వద్ద ఇసుక తవ్వకాలు అడ్డుకున్నా.. ఇప్పటికే ఏర్పాటు చేసిన డంపుల నుంచి ఇసుక బయటకు వెళ్తే అక్రమ రవాణాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడినట్లు ఎలా భావించాలన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారులు కేవలం వాగు పరీవాహక ప్రాంతంలో పహారా నిర్వహించడానికే పరిమితం కాకుండా, ఇప్పటికే గుర్తించినట్లు చెబుతున్న ఇసుక డంపులపై కూడా సమగ్ర తనిఖీలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.