వాషింగ్టన్, ఆగస్టు 8: రష్యా నుంచి చమురు, గ్యాస్ను ప్రధానంగా కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కల్పించే ఒక బిల్లును అమెరికా సెనేట్ శుక్రవారం ఆమోదించింది. దీంతో కొత్త వాణిజ్య ఆంక్షల ప్రమాదం ఉన్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరింది. రష్యా, ఇరాన్లపై ఆంక్షలు విధించే లిండ్స్ ఓ గ్రాహమ్ చట్టం-2026ను సెనేట్ 86-11 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఇప్పుడు ఈ బిల్లు ప్రతినిధుల సభకు(హౌస్ ఆఫ్ రిప్రెంజెటిటివ్స్) వెళుతుంది. ముందుగా ఈ బిల్లు చట్టంగా మారి ఆ తర్వాత వాటిని విధించాలా వద్దా అనే విషయంలో ట్రంప్కు నిర్ణయాధికారం ఉంటుంది. ఈ బిల్లు అమెరికాకు జరిగే భారతీయ ఎగుమతులపై మరిన్ని సుంకాలు విధించే ముప్పును కలిగిస్తున్నది. రష్యా నుండి చమురు, సహజ వాయువును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న చైనా, భారత్, అజర్బైజాన్, హంగేరీ, స్లోవేకియా వస్తువులపై 100 శాతం వరకు సంకాలు విధించే అవకాశం ఏర్పడింది.
ప్రభుత్వ నిర్ణయాల్లో ట్రంప్ జోక్యం: కేజ్రీవాల్
భారత ప్రభుత్వం తీసుకొనే ప్రతి నిర్ణయంలోనూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం కనిపిస్తున్నదని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.భారత్తో సహా ఐదు దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించడానికి వీలు కల్పించే బిల్లును అమెరికా సెనేట్ ఆమోదించిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ విమర్శలు చేశారు. దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టి, ట్రంప్ ముందు బానిసత్వం వహించి, భారత్ అవమానానికి గురయ్యేలా చేశారు. ఇప్పుడు మోదీ దేశానికి దీన్ని తెచ్చారు. నేడు దేశానికి సంబంధించిన ప్రతి చిన్న, పెద్ద నిర్ణయంలోనూ ట్రంప్ జోక్యం ఉన్నది అని పేర్కొన్నారు.