Parliament Winter Session | న్యూఢిల్లీ, డిసెంబర్ 3: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వాటిని తిప్పికొట్టేందుకు అధికార బీజేపీ వ్యూహాలకు పదునుపెట్టింది. పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను లోక్సభ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ ఇచ్చిన నివేదికను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి.
మహువాపై ఎథిక్స్ కమిటీ నివేదికపై తొలి రోజే చర్చ నిర్వహించే అవకాశం ఉన్నది. అలాగే ఈ సమావేశాల్లో అధికార బీజేపీ పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నది. భారత శిక్షాస్మృతి(ఐపీసీ), సీఆర్పీసీ, సాక్షాధారాల చట్టం స్థానంలో తీసుకురానున్న మూడు కొత్త బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదింపజేసుకోవాలని మోదీ సర్కారు భావిస్తున్నది. అలాగే ఎన్నికల కమిషనర్ల నియామకాల ప్యానల్ నుంచి సీజేఐని తప్పించే బిల్లు కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నది.
కొత్తగా తీసుకొస్తున్న నేర బిల్లులకు హిందీలో పేర్లు పెట్టడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని పార్లమెంట్లో వ్యతిరేకించే అవకాశం ఉన్నది. అలాగే మణిపూర్లో హింస, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపైనా ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టనున్నాయి. ‘పార్లమెంట్లో ఏ అంశంపై చర్చకైనా మేము సిద్ధం. అయితే ఈ చర్చలు స్వల్పకాల వ్యవధితో ఉండాలి. అంతేకాక చర్చలకు అవసరమైన అనుకూలమైన వాతావరణాన్ని సభలో కల్పించాలి’ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు.