Winter Session : ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)’ వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంట్ (Parliament) ఉభయసభలు దద్ధరిల్లాయి. ఓట్ చోరీ, గద్ది చోరీ అంటూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నినాదాలు చేశారు. ఫలితంగా ఉభయసభల్లో గందరగోళం నెలకొన్నది. లోక్సభ (Lok Sabha) ను కంట్రోల్ పెట్టేందుకు స్పీకర్ ఓంబిర్లా (OM Birla) చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
దాంతో స్పీకర్ ముందుగా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దాంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభ వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటలకు సభ పునఃప్రారంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. గందరగోళం కొనసాగింది. దాంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
అంతకుముందు ప్రతిపక్ష సభ్యులు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి ఓట్లు దోచిపెట్టే పని చేస్తున్నదని విమర్శించారు.