న్యూఢిల్లీ: హర్యానాలోని అధికార బీజేపీ, జేజేపీ ఎమ్మెల్యేల ఇండ్ల వద్ద రైతులు శనివారం నిరసన చేయనున్నారు. పంజాబ్లోని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద కూడా రైతులు నిరసన చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్కు చెందిన రైతు నేత రాకేశ్ తికాయిత్ తెలిపారు. ధాన్యం కొనుగోలు డిమాండ్ కోసం రైతుల ఆందోళన జరుగుతుందన్నారు. పంజాబ్, హర్యానాలో రైతుల నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనిని అక్టోబర్ 11 వరకు వాయిదా వేసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట పరిపక్వత ఆలస్యమైందని పేర్కొంది.
కాగా, కేవలం పంజాబ్, హర్యానాలో మాత్రమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలును కేంద్రం ఆలస్యం చేయడంపై రైతులు, ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో శనివారం హర్యానా, పంజాబ్లో రైతుల నిరసనకు రాకేశ్ తికాయిత్ శుక్రవారం పిలుపునిచ్చారు.