Kejriwal- ED | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ‘కుట్రదారు’ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రద్దు చేసిన మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ తో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ కుట్ర పన్నారని ఈడీ ఆరోపణ. ‘సౌత్ లాబీ’కి మేలు చేసేందుకు ఈ మద్యం పాలసీ రూపొందించారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిగా ఆప్ పార్టీకి సౌత్ లాబీ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారని ఈడీ ఆరోపిస్తున్నది. కొందరు నిందితుల సాక్ష్యాధారాలు, ప్రకటనల ఆధారంగా కేజ్రీవాల్ పేరు బయటకు వచ్చింది. ఇప్పటికే న్యాయస్థానాల్లో దాఖలు చేసిన చార్జిషీట్లు, రిమాండ్ నోట్లలో కేజ్రీవాల్ పాత్ర ఉన్నదని ఈడీ తెలిపింది.
ఈ కేసు నిందితుల్లో ఒకరైన విజయ్ నాయర్ తరుచుగా కేజ్రీవాల్ ఆఫీసును సందర్శించారని, అక్కడే టైం గడిపారని ఈడీ వివరించింది. కేజ్రీవాల్ తో మద్యం పాలసీ గురించి చర్చించినట్లు ఢిల్లీ మద్యం వ్యాపారులకు విజయ్ నాయర్ చెప్పారని ఆరోపనలు ఉన్నాయి. కేజ్రీవాల్ ను ఇండో-స్పిరిట్ ఓనర్ సమీర్ మహేందుతో కలిపేందుకు విజయ్ నాయర్ ప్రయత్నించినా కుదరలేదు. ఆంధ్రప్రదేశ్ లోని అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కొడుకు రాఘవ్ మాగుంట కూడా కేజ్రీవాల్ ను కలుసుకుని లిక్విడ్ పాలసీ గురించి చర్చించారని చెబుతున్నారు.
మద్యం పాలసీపై మంత్రుల కమిటీ రూపొందించిన ముసాయిదా నివేదికను అప్పటి డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా 2021 మార్చిలో తనకు అందజేశారని సిసోడియా మాజీ కార్యదర్శి సీ అరవింద్ వాంగ్మూలం ఇచ్చారు. సిసోడియాతో భేటీ తర్వాత కేజ్రీవాల్తో మాట్లాడేందుకు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అక్కడే ఉన్న సత్యేంద్ర జైన్ తనకు ఒక నివేదిక ఇచ్చారన్నారు. మంత్రుల కమిటీలో ఎటువంటి ప్రతిపాదన చర్చించకున్నా, ఆ నివేదిక ఆధారంగా మంత్రుల కమిటీ నివేదిక రూపొందించాలని తనకు చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని అరవింద్ చెప్పారు.