న్యూఢిల్లీ: 2023లో దేశంలోని పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావించవచ్చు. ఎందుకంటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి దేశంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీతోపాటు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో 2023లో ఏయే రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయో, ఆయా రాష్ట్రాల్లో పార్టీల బలాబలాలేమిటో వివరంగా తెలుసుకుందాం..
నాలుగు ఈశాన్య రాష్ట్రాల్లో..
2023 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయా, త్రిపుర, నాగాలాండ్లలో, నవంబర్లో మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాల్లో కేవలం త్రిపురలో మాత్రమే స్థానిక ఐపీఎఫ్టీతో కలిసి బీజేపీ అధికారంలో ఉన్నది. ఇక నాగాలాండ్, మేఘాలయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు జూనియర్ పార్ట్నర్గా ఉన్నది. మిజోరంలో అధికార మిజో నేషనల్ ఫ్రంట్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది.
కర్ణాటకలో..
దక్షిణాధిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. ఆ రాష్ట్రంలో 2023 మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ల మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది. 2019లో జేడీఎస్తో కలిసి కాంగ్రెస్ సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేసింది. కానీ, కొన్ని రోజులకే బీజేపీ కుట్రచేసి ఆ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారంలోకి వచ్చింది. దాంతో ఈసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తుండగా.. బీజేపీ రెబెల్స్ బెడదను ఎదుర్కొంటున్నది.
తెలంగాణలో..
2014లో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో 2023 నవంబర్, డిసెంబర్ నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అధికార భారత రాష్ట్రసమితి (బీఆర్ఎస్)కి.. కాంగ్రెస్, బీజేపీలకు మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. 2024 లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రధాన పాత్ర పోషించాలనే లక్ష్యంతో ఉన్న బీఆర్ఎస్ ఆ దిశగా వ్యూహం రచిస్తున్నది.
మధ్యప్రదేశ్లో..
దేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో కూడా 2023 నవంబర్, డిసెంబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ 2018లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ కాంగ్రెస్లో విభేదాలను ఆసరాగా చేసుకుని ఆ పార్టీలో చీలిక తెచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం బీజేపీ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ గెలుపుపై ధీమాగా ఉన్నది. మధ్యప్రదేశ్లో గెలుపు కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో నైతిక బలాన్ని చేకూర్చనుంది.
ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో..
ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. రాజస్థాన్లో కూడా గెహ్లాట్ సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్ర చేసినా కాంగ్రెస్ హైకమాండ్ సకాలంలో స్పందించి ప్రభుత్వాన్ని కాపాడుకుంది. అంతేగాక ఈ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరింత బలపడింది. దాంతో వరుసగా రెండోసారి అధికారం తమదేనని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్ ధీమాతో ఉన్నారు.