Akhilesh Yadav: ఉత్తప్రదేశ్లోని అయోధ్య నగరంలో నూతనంగా నిర్మించిన రామ మందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 22న ఆలయంలో నెలకొల్పబోయే శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగనుంది. ఈ నెల 15 నుంచి ఆలయ ప్రారంభానికి సంబంధించిన ప్రధాన కార్యక్రమాలు మొదలుకానున్నాయి.
ఈ కార్యక్రమం కోసం కేంద్రం ఇప్పటికే పలువురు ఆధ్యాత్మికవేత్తలకు, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ఉత్తరప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీకి కూడా ఆహ్వానాలు అందాయి. కాంగ్రెస్ పార్టీ అయోధ్యకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ‘కాంగ్రెస్ పార్టీతోపాటు మీరు కూడా అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరవుతారా..?’ అని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ‘భగవంతుడు పిలిస్తే ఎవరైనా వెళ్తారు. మాకూ దేవుడి నుంచి పిలుపు వస్తే మేం కూడా వెళ్తాం’ అని ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు.