హంగ్ పార్లమెంట్ లేదా హంగ్ అసెంబ్లీ వస్తే కొత్తగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వాలు కూలిపోయినప్పుడు మిగతా కాలవ్యవధికి గానూ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలి. కొత్త ఎన్నికలను మధ్యంతర ఎన్నికలుగానే వ్యవహరించాలి.
మధ్యంతర ఎన్నికల ద్వారా కొత్తగా ఏర్పడిన సర్కారు పాలన కాలం మిగిలిన కాలవ్యవధి వరకు మాత్రమే ఉంటుంది. అంటే రెండేండ్లకు ఏదైనా సర్కారు కూలిపోతే, కొత్తగా నిర్వహించిన ఎన్నికల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం పదవీకాలం మూడేండ్లకే పరిమితమవుతుంది.
-‘జమిలి ఎన్నికల’పై కోవింద్ కమిటీ కీలక సిఫారసు
Jamili Elections | హైదరాబాద్, మార్చి 14 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ జమిలి ఎన్నికల (ఒకే దేశం-ఒకే ఎన్నికలు) సాధ్యాసాధ్యాలకు సంబంధించిన సమగ్ర నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్కు వెళ్లిన కమిటీ సభ్యులు.. జమిలి ఎన్నికలపై 18,626 పేజీల సమగ్ర నివేదికను రాష్ట్రపతికి అందజేశారు. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని నివేదికలో పేర్కొన్నది. దేశంలో ఏకకాలంలో లోక్సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాలపై గత సెప్టెంబర్లో కేంద్రప్రభుత్వం కోవింద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది.
అవిశ్వాస తీర్మానం వంటి సందర్భాలు ఎదురై ప్రభుత్వం పడిపోతే, బల ప్రదర్శన ద్వారా మెజారిటీ చూపించుకొన్న పార్టీని ప్రభు త్వ ఏర్పాటుకు ఇప్పటివరకూ ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. అవిశ్వాస తీర్మానం వంటి సందర్భాలు ఎదురైనప్పుడు కూడా మిగ తా కాల వ్యవధికి గానూ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫారసు చేసింది. అంటే, అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వం పడిపోతే, బలప్రదర్శన అనేది ఇకపై ఉండబోదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
191 రోజుల పాటు జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృతమైన సమావేశాలు నిర్వహించింది. జమిలిపై అభిప్రాయాలను తెలుపాలంటూ 62 రాజకీయ పార్టీలను కమిటీ కోరగా.. 47 పార్టీలు తమ అభిప్రాయాలు తెలిపాయి. ఇందులో బీజేపీ, అన్నాడీఎంకే వంటి 32 పార్టీలు జమిలికి మద్దతిచ్చాయి. కాంగ్రెస్, ఆప్, సీపీఎం వంటి 15 పార్టీలు వ్యతిరేకించాయి. బీఆర్ఎస్, ఎన్సీపీ, జేడీఎస్, ఆర్జేడీ, టీడీపీ, వైసీపీ వంటి మరో 15 పార్టీలు స్పందించలేదు. వందలాది మంది ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు, సూచనలు కోరగా.. 21,558 స్పందనలు వచ్చాయి. వీరిలో 81 శాతం మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు.
మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో గత సెప్టెంబర్ 2న ఈ కమిటీని కేంద్రం నియమించింది. కేంద్ర హోంమంత్రి అమిత్షా, లోక్సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాంనబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, లోక్సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాశ్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యులుగా నియమించారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్, కమిటీ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రకు బాధ్యతలు అప్పగించారు.
దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పిన్స్ దేశాల్లో ఏకకాల ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో నివేదికను సమర్పించే కంటే ముందు కమిటీ సభ్యులు ఆయా దేశాల్లో ఎన్నికల నిర్వహణ తీరుపై లోతైన విశ్లేషణ చేపట్టారు.
‘ఒకే దేశం…ఒకే ఎన్నిక’ అంశంపై లా కమిషన్ కూడా తమ నివేదికను దాదాపుగా సిద్ధం చేసినట్టు సమాచారం. త్వరలోనే న్యాయశాఖకు ఈ నివేదికను సమర్పించనున్నట్టు తెలుస్తున్నది. కాగా, ‘జమిలి’పై కోవింద్ కమిటీ లా కమిషన్ అభిప్రాయాన్ని కోరగా.. ఏకకాల ఎన్నికల నిర్వహణను లా కమిషన్ సమర్థించినట్టు సమాచారం.
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అనంతరం 1967 వరకూ నాలుగు మార్లు దేశంలో ఏకకాల ఎన్నికలే జరిగాయి. అయితే, ప్రభుత్వాలు మధ్యలో కూలిపోవడం తదితర కారణాలతో లోక్సభ, వివిధ రాష్ర్టాల అసెంబ్లీలకు జరిగే ఎన్నికల తేదీల్లో మార్పులు వచ్చాయి. దేశంలో ఏకకాల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై 2015లో ఎన్నికల సంఘం (ఈసీ) కూడా ఒక నివేదికను సమర్పించింది. జమిలి ఎన్నికలకు ఈసీ మద్దతు ప్రకటించింది. అయితే, ఈ ప్రతిపాదనలను ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి.
జమిలి ఎన్నికలు దేశాభివృద్ధిని, సామాజిక ఐక్యతను ప్రోత్సహిస్తాయని కోవింద్ కమిటీ నివేదికలో అభిప్రాయపడింది. ఏకకాల ఎన్నికలు ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేస్తాయని, భారత జాతి ఆకాంక్షలు సాకారమవ్వడానికి సహకరిస్తాయని తెలిపింది. తరుచూ ఎన్నికలు జరిగితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రభుత్వ పాలన కుంటుపడుతుందన్న కమిటీ.. పాలసీల అమల్లో జాప్యం జరుగుతుండటంతో దేశ ఆర్థిక ప్రగతికి ఇది ఓ విధంగా గొడ్డలిపెట్టుగానే మారుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కారణాల వల్లే ఏకకాల ఎన్నికలకు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటిస్తున్నట్టు వివరించింది.