న్యూఢిల్లీ: లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన మూడు బిల్లులపై శుక్రవారం సభలో మాట్లాడారు. అయితే తన ప్రసంగాన్ని ఒక చిక్కుముడితో ముగించారు. (Riddle of 16) ‘ఈ చిక్కుప్రశ్నకు పూర్తి సమాధానం ‘16’ అనే సంఖ్యలోనే ఉంది. అంతా ఆ ‘16’ సంఖ్యలోనే దాగి ఉంది’ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ఇప్పుడు చేపట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఈ చిక్కుప్రశ్నతో ముడిపడి ఉన్నదని ఆయన వివరించారు.
కాగా, గురువారం లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగం చాలా శక్తి హీనంగా, విచ్ఛిన్నంగా ఉన్నదని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘ఆయన (మోదీ) చర్చల్లో పాల్గొనలేకపోయారు. ఎందుకంటే ఈ బిల్లును ఆమోదింపజేయడానికి ప్రయత్నించడం స్పష్టంగా ఒక పొరపాటు. ఎందుకంటే అది నెగ్గదని, తీవ్ర భయాందోళనలకు గురవుతుందని అందరికీ తెలుసు’ అని అన్నారు.
అయితే, అదే తనకు జ్ఞానోదయం కలిగించిన క్షణమని రాహుల్ గాంధీ తెలిపారు. ‘నేను ఆయన్ను (మోదీ) చూస్తున్నప్పుడు, నా ఫోన్లో ఏప్రిల్ 16వ తేదీని గమనించా. అప్పుడు నేను, ‘దేవుడా, ఎంత విచిత్రం. అదే ఆ సంఖ్య. 16! ఈ పదహారు సంఖ్య, ఇదే ఆ సంఖ్య. ఈ చిక్కుముడికి పూర్తి సమాధానం 16 సంఖ్యలోనే ఉన్నది. ప్రతీదీ పదహారు సంఖ్యలోనే ఉన్నదని అనుకున్నా’ అని అన్నారు.
మరోవైపు తాను చెప్పేది ఎవరికైనా అర్థమైతే, దయచేసి తనకు మెసేజ్ పంపాలని రాహుల్ గాంధీ కోరారు. ‘ఆ చిక్కుముడి ఏమిటో మీరు ట్విట్టర్లో కూడా చెప్పవచ్చు. కానీ మీ ప్రశ్నలకు సమాధానం, ఆ చిక్కుముడి గురించి మీరు త్వరలోనే తెలుసుకుంటారు. పదహారు సంఖ్యలోనే అంతా ఉన్నది’ అని వ్యాఖ్యానించారు.
కాగా, లోక్సభలో రాహుల్ గాంధీ ప్రస్తావించిన ‘16’ సంఖ్య చిక్కుముడి దక్షిణాది రాష్ట్రంతో సంబంధం ఉన్నట్లు తెలుస్తున్నది. 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత 543 మంది సభ్యులు కలిగిన లోక్సభలో బీజేపీకి సొంతంగా పూర్తి మెజారిటీ లేదు. లోక్సభలో బీజేపీకి ప్రస్తుతం 240 మంది ఎంపీలున్నారు. కీలక మిత్రపక్షాలైన నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)కు 12 మంది, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీకి 16 మంది ఎంపీలున్నారు.
మరోవైపు లోక్సభ స్థానాల పెంపు వల్ల తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలకమైన దక్షిణాది రాష్ట్రానికి చెందిన టీడీపీ, మోదీ ప్రభుత్వ ప్రణాళికలకు పూర్తిగా మద్దతు ఇవ్వకపోవచ్చని రాహుల్ గాంధీ అంచనా. అందుకే ‘16’ పజిల్ ద్వారా ఈ అంశాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించినట్లు అంతా భావిస్తున్నారు.
VIDEO | In Lok Sabha, LoP Rahul Gandhi says, “Yesterday I was watching the Prime Minister speak. Low energy, broken, nothing transmitting, and I suddenly noticed that yesterday was the 16th of April… He was not able to engage because clearly trying to pass this bill was a… pic.twitter.com/UKbggr71H0
— Press Trust of India (@PTI_News) April 17, 2026
Also Read:
Rahul Gandhi: మెజీషియన్ ఆఫ్ బాలాకోట్.. డిమానిటైజేషన్.. సింధూర్: మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు
Watch: థార్తో ఐదుగురిని ఢీకొట్టిన ఎమ్మెల్యే కొడుకు.. హారన్ మోగిస్తున్నా ఎందుకు తప్పుకోలేదంటూ వాదన