లక్నో: పెళ్లి వేడుకకు వెళ్లిన బాలుడు విందు సందర్భంగా పలుమార్లు రసగుల్లాలు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో క్యాటరింగ్ సిబ్బంది ఆగ్రహించాడు. ఆ బాలుడ్ని ఎత్తి తందూర్ మంటలోకి విసిరేశాడు. (Caterer Throws Boy Into Fire) తీవ్రంగా కాలిన గాయాలైన ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నది. ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 11 ఏళ్ల చమన్ తల్లి మరణించడంతో అమ్మమ్మ ఇంట్లో నివసిస్తున్నాడు. ఆ బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు.
కాగా, ఏప్రిల్ 15న చమన్ తన అమ్మమ్మతో కలిసి గ్రామంలో జరిగిన బంధువుల పెళ్లి వేడుకకు వెళ్లాడు. విందు సందర్భంగా ఆ బాలుడు పలుమార్లు రసగుల్లాలు తీసుకున్నాడు. గమనించిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ అతడిపై ఆగ్రహించాడు. తొలుత చమన్ను పట్టుకుని బెదిరించాడు. ఆ తర్వాత అతడ్ని పైకి ఎత్తి తందూర్ పొయ్యి వద్దకు తీసుకెళ్లాడు. అదుపు తప్పిన ఆ బాలుడు తందూర్ మంటలో పడిపోయాడు. ఇది చూసి క్యాటరింగ్ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.
మరోవైపు అక్కడున్న పెళ్లి అతిథులు షాక్ అయ్యారు. తందూర్ పొయ్యిలో పడిపోయిన ఆ బాలుడ్ని బయటకు తీశారు. ముఖం నుంచి నడుము వరకు తీవ్ర కాలిన గాయాలైన చమన్ను వెంటనే అయోధ్య మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రాథమిక చికిత్స తర్వాత ఆ బాలుడ్ని లక్నో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న చమన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడు చమన్ మేనమామ ఫిర్యాదు ఆధారంగా క్యాటరింగ్ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. పారిపోయిన నిందితుడి అరెస్ట్ కోసం పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Woman High Court jump threat | హైకోర్టు పైకి ఎక్కిన మహిళ.. బిడ్డతో సహా కిందకు దూకుతానని బెదిరింపు