లక్నో: ఒక మహిళ హైకోర్టు భవనంపైకి ఎక్కింది. తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని ఆరోపించింది. ఈ నేపథ్యంలో బిడ్డతో సహా కిందకు దూకుతానని ఆమె బెదిరించింది. అక్కడున్న న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించారు. ఆ మహిళ, ఆమె బిడ్డను సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. (Woman High Court jump threat) ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 10న అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ వద్ద ఒక నాటకీయమైన సంఘటన జరిగింది. గోండాలో నివసించే మహిళ తన బిడ్డతో సహా కోర్టు బిల్డింగ్పైకి ఎక్కింది.
కాగా, కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆ మహిళ ఆరోపించింది. మత మార్పిడికి బలవంతం చేశారని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశారని తెలిపింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించారని ఆరోపించింది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత బాధ్యత తీసుకోవడానికి వారు నిరాకరించారని తెలిపింది.
అయితే గ్రామ పెద్దతో సహా పలువురు వారికి అండగా నిలుస్తున్నారని, కేసును ముందుకు తీసుకువెళితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు ఆ మహిళ వాపోయింది. తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని, కేసు నమోదు చేయలేదని ఆ మహిళ ఆరోపించింది. వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. తాను కిందకు దూకుతానని, తన బిడ్డను కూడా విసిరేస్తానని ఆమె బెదిరించింది.
మరోవైపు అక్కడే ఉన్న న్యాయవాదులు, కోర్టు అధికారులు, సిబ్బంది, పోలీసులు వెంటనే స్పందించారు. ఈ గందరగోళం మధ్య ఆ మహిళ స్పృహ కోల్పోయింది. ఆమెతో పాటు, ప్రమాదకరంగా వేలాడుతున్న బిడ్డను సురక్షితంగా కిందకు తీసుకువచ్చారు. ఆ మహిళ ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని పోలీస్ అధికారి తెలిపారు.
Also Read: