న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని అన్ని పార్టీల నేతలతో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారంటే దేశమంతా ఆసక్తిగా గమనించింది. రెండేళ్ల కిందట రాష్ట్ర హోదా కోల్పోయిన జమ్ముకశ్మీర్లో ఏం జరుగుతుంది? మళ్లీ అది కేంద్ర పాలిత ప్రాంతం నుంచి రాష్ట్రంగా మారుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు. ఈ సమావేశంలో రాష్ట్ర హోదా, ఎన్నికల కోసమే అన్ని పార్టీలు పట్టుబట్టగా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం పునర్విభజన అంశాన్నే ప్రధానంగా లేవనెత్తింది. ఈ పునర్విభజన ప్రక్రియలో అందరు నేతలు పాల్గొనాలని మోదీ పిలుపునివ్వగా.. నేషనల్ కాన్ఫనెన్స్ లాంటి అక్కడి ప్రధాన పార్టీలు మాత్రం అసలు పునర్విభజన అవసరం లేదని వాదించాయి.
జమ్ముకశ్మీర్లోని అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం కేంద్రం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అది దీనిని మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2019లో జమ్ముకశ్మీర్ను మిగతా దేశంతో కలపాలని ప్రత్యేక హోదా ఎత్తేశారు. మరి ఇప్పుడు దేశమంతా పునర్విభజన ప్రక్రియ 2026లో జరగబోతుంటే.. ఇక్కడ మాత్రం ఇప్పుడు ఎందుకు అని ఒమర్ ప్రశ్నిస్తున్నారు.
అసలేంటీ పునర్విభజన?
ఓ ప్రాంత జనాభాలో వచ్చే మార్పులను బట్టి అసెంబ్లీ లేదా లోక్సభ నియోజకవర్గ సరిహద్దులను మార్చడమే పునర్విభజన. దీనికోసం ప్రత్యేకంగా పునర్విభజన కమిషన్ ఉంటుంది. ఇది స్వతంత్ర సంస్థ. దీని పనిలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోలేవు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలోని ఈ కమిషన్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేదా ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు సభ్యులుగా ఉంటారు.
జమ్ముకశ్మీర్లోని ఐదుగురు ఎంపీలు కూడా ఇందులో అసోసియేట్ సభ్యులుగా ఉన్నా.. వాళ్ల సిఫార్సులను కచ్చితంగా పట్టించుకోవాలని ఏమీ లేదు. అయితే 2019, ఆగస్ట్ 5న జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాను తొలగించడం, ఆ తర్వాత ఈ పునర్విభజనను సవాలు చేస్తూ నేషనల్ కాన్ఫరెన్స్, ఇతర పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీంతో పునర్విభజన కమిషన్ సమావేశాలను ఫరూక్ అబ్దుల్లాతోపాటు ఇతర ఎన్సీ ఎంపీలు బాయ్కాట్ చేశారు.
జమ్ముకశ్మీర్లో పునర్విభజన
2019లో జమ్ముకశ్మీర్ తన ప్రత్యేక హోదాను కోల్పోయే ముందు వరకూ ఇక్కడి లోక్సభ పునర్విభజన భారత రాజ్యాంగ పరిధిలో, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జమ్ముకశ్మీర్ రాజ్యాంగం పరిధిలో ఉండేవి. జమ్ముకశ్మీర్లో చివరిసారి 1995లో 1981నాటి జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన జరిగింది. 1991లో జనాభా లెక్కలు జరగలేదు. 2001లో జరిగినా కూడా రాష్ట్రంలో 2026 వరకూ పునర్విభజన అవసరం లేదని 2002లో అక్కడి అసెంబ్లీ తీర్మానం చేసింది.
కానీ 2019లో ప్రత్యేక హోదా ఎత్తేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మాత్రం పునర్విభజన కమిషన్ను ఏర్పాటు చేసింది. గతేడాది కొవిడ్ కారణంగా ఈ కమిషన్ గడువును పెంచింది. జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ప్రకారం అక్కడ 90 అసెంబ్లీ సీట్లు ఉండాలి. ఆ లెక్కన గతంలో కంటే ఏడు సీట్లు ఎక్కువ ఉంటాయి. లఢక్లోని 4 సీట్లు కలుపుకొని 2019 వరకూ జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య 87. ఇందులో కశ్మీర్లో 46, జమ్ములో 37 ఉన్నాయి.
పునర్విభజన అనేది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది కాబట్టి జమ్ములోని పలు సంఘాలు దీనిని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే జమ్ము కంటే కశ్మీర్లోనే ఎక్కువ జనాభా. 2011 జనాభా లెక్కల ప్రకారం కశ్మీర్లో 68 లక్షలు, జమ్ములో 53 లక్షలు ఉన్నారు. ఆ లెక్కన కశ్మీర్కే ఎక్కువ సీట్లు వస్తాయి.