కోల్కతా: పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) హవా కొనసాగుతున్నది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఎంసీ 8,232 పంచాయతీలను కైవసం చేసుకున్నది. మరో 2,712 పంచాయతీల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇక ప్రతిపక్ష బీజేపీ టీఎంసీకి ఆమడ దూరంలో ఉన్నది. ఆ పార్టీ కేవలం 1,714 పంచాయతీల్లో మాత్రమే విజయం సాధించింది. మరో 734 పంచాయతీల్లో లీడ్లో ఉంది.
ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట అయిన ఆ రాష్ట్రంలో కమ్యూనిస్టుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. సీపీఎం కేవలం 599 పంచాయతీలు గెలుచుకుని, మరో 531 పంచాయతీల్లో ఆధిక్యంలో ఉంది. సీపీఐ మరింత దారుణంగా ఏడు పంచాయతీల్లో గెలిచి, రెండు పంచాయతీల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇక కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల కంటే దారుణంగా కేవలం 362 పంచాయతీల్లో మాత్రమే గెలిచింది. ఇంకో 215 పంచాయతీల్లో ఆధిక్యంలో ఉన్నది.
కాగా, పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మొత్తం 63,229 పంచాయతీలు ఉన్నాయి. అందులో 63,219 పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఇవాళ ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయాలు నమోదు చేస్తుండటంతో కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఆ పార్టీ హవానే కొనసాగే అవకాశం ఉన్నదని స్థానిక రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.