Abhishek Banerjee : టీఎంసీ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ (Mamata Banerjee) మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) నివాసంలో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో దర్యాప్తు నిమిత్తం కాళీఘాట్ (Kalighat) లోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు పార్టీ వర్గాలు ఆరోపించాయి. ఈ తనిఖీల గురించి తెలుసుకున్న పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హుటాహుటిన అభిషేక్ నివాసానికి చేరుకున్నారు.
సల్బోని ప్రాంతంలోని ఓ భూమికి సంబంధించిన కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ బెనర్జీ అనుచరుడి కోసం తాము గాలిస్తున్నట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. అభిషేక్ నివాసంలో నాలుగు గంటలకు పైగా సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. అయితే పోలీసులతోపాటు కేంద్ర భద్రతా బలగాలు కూడా తనిఖీల్లో పాల్గొనడంతో టీఎంసీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆపరేషన్ చేపట్టారని విమర్శించారు. మరో ఘటనలో మున్సిపాలిటీ నియామకాల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు టీఎంసీ ఎమ్మెల్యే మదన్మిత్ర నివాసంపై దాడులు చేశారు.
కామర్హతి మున్సిపాలిటీతో సహా వివిధ మున్సిపాలిటీల్లోని పోస్టులలో మదన్ మిత్ర అనర్హులైన అభ్యర్థులను నియమించినట్లు వెల్లడించారు. ఇందుకుగాను వారి నుంచి భారీ మొత్తంలో నగదు, బంగారం తీసుకున్నట్లు తెలిపారు. సోదాలు నిర్వహిస్తుండగా అతడి మంచం కింద నగదు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.