అతని వయసు 58 సంవత్సరాలు..! తెలంగాణలోని ఖమ్మం జిల్లా అతని స్వస్థలం..! రెండు నెలల క్రితం ఉన్నట్టుండి ఇంటి నుంచి తప్పిపోయాడు..! కానీ, కొన్ని రోజుల క్రితం బెంగాల్లో ప్రత్యక్షమయ్యాడు..! వెస్ట్ బెంగాల్లోని ఓ రేడియో క్లబ్ టీమ్ అతడిని తప్పిపోయిన వ్యక్తిగా గుర్తించింది..! అయితే, అతడు ఏ ప్రాంతం నుంచి వచ్చాడో గుర్తించేందుకు మాత్రం ఆ రేడియో క్లబ్ చాలా శ్రమించాల్సి వచ్చింది..! చివరికి అతడిది ఖమ్మం జిల్లా అని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం చేరవేసింది..!
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా బల్లెపల్లి మండలానికి చెందిన వేముల వెంకటస్వామి (58) రెండు నెలల క్రితం ఇంటి నుంచి తప్పిపోయాడు. ఇంట్లో వాళ్లు కొన్ని రోజులు వెతికి వదిలేశారు. కానీ, గత నెల 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాకు 100 కిలోమీటర్ల దూరంలోని సాగర్ ఐలాండ్లో జరిగిన గంగాసాగర్ మేళాలో అతడు ప్రత్యక్షమయ్యాడు. మేళా జరిగినన్ని రోజులు వెంకటస్వామి అక్కడే తచ్చాడటం అంబరీష్ నాగ్ బిశ్వాస్ నేతృత్వంలోని రేడియో క్లబ్ గుర్తించింది.
టీ స్టాల్ దగ్గర భోజనం అడుగుతూ
ఇండియన్ అకాడమీ ఆఫ్ కమ్యూనికేషన్ విద్యార్థులు, రింకు నాగ్ బిశ్వాస్ నేతృత్వంలోని విపత్తు నిర్వహణ దళంతో కలిసి రేడియో క్లబ్ టీమ్ సభ్యులు కూడా గంగాసాగర్ మేళాలో భక్తులకు అత్యవసర సహాయక చర్యలు అందించే పనిలో ఉన్నారు. అదేవిధంగా తప్పిపోయిన భక్తుల గురించి మైకులలో ప్రకటించి కుటుంబసభ్యుల చెంతకు చేరుస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకటస్వామి కూడా రేడియో క్లబ్ వారి కంటపడ్డాడు. వెంకటస్వామి ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్లి భోజనం కోసం అడుగుతుండటాన్ని అంబరీష్ బిశ్వాస్ టీమ్ గమనించింది.
వెంటనే టీమ్ సభ్యులు అతడి దగ్గరికి వెళ్లి వివరాలు అడిగారు. దాంతో వెంకటస్వామికి సరిగా మాటలు రావని, వినికిడి శక్తి కూడా తక్కువగా ఉందని వాళ్లకు అర్థమైంది. దాంతో అతడి నుంచి తన స్వస్థలానికి సంబంధించి ఏ వివరాలు రాబట్టలేకపోయారు. దాంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే ఆహారపదార్థాలను అతడికి ఆహారంగా ఇచ్చి చూశారు. కానీ వెంకటస్వామి ఎలాంటి తేడా లేకుండా ఏ ఆహారమైనా ఒకేలా ఆరగిస్తున్నాడు. దాంతో అతడికి వివిధ ఆలయాల ఫొటోలను చూపించారు. కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపహడ్ ఆలయాన్ని వెంకటస్వామి గుర్తుపట్టాడు.
ఎన్టీఆర్ విగ్రహం ఫొటోను చూసి ఎగ్జయిట్
అదేవిధంగా హైదరాబాద్లోని కూకట్పల్లి రైతు బజార్ను కూడా వెంకటస్వామి గుర్తించాడు. దాంతో వెంకటస్వామి తెలంగాణకు చెందినవాడని అంబరీష్ రేడియో క్లబ్ సభ్యులు నిర్ధారణకు వచ్చారు. అయితే తెలంగాణలో ఏ ప్రాంతంవాడో తెలుసుకునేందుకు రాజకీయ నాయకుల ఫొటోలను చూపించారు. దాంతో ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కను గుర్తుపట్టాడు. ఆ తర్వాత ఖమ్మంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఫొటోను చూపించగా వెంకటస్వామి బాగా ఎగ్జయిట్ అవడం గమనించారు.
వెంటనే రేడియో క్లబ్ ఓనర్ అంబరీష్ బిశ్వాస్.. ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్కు, ఖమ్మం పోలీస్ కమిషనర్కు, రంగనాథపురం పోలీసులకు వెంకట స్వామి ఫొటోలను పంపించాడు. విషయం చెప్పి అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాలని కోరాడు. దాంతో పోలీసులు వెంకటస్వామి కుటుంబాన్ని కనిపెట్టి అతని కొడుకు రాంబాబుకు విషయం చెప్పారు. దాంతో రాంబాబు తండ్రిని తీసుకొచ్చుకునేందుకు అతడి బావమరిదితో కలిసి పశ్చిమబెంగాల్కు బయలుదేరాడు. అక్కడ యోగిరాజ్ శ్యామచరన్ సనాతన్ మిషన్లో ఉన్న వెంకటస్వామిని అక్కడి అధికారులు, అంబరీష్ టీమ్ రాంబాబుకు అప్పగించనున్నారు.
తరచూ ఇల్లు విడిచిపోవడం అలవాటు
కాగా, వెంకటస్వామి తప్పిపోయి రెండు నెలలు అయినా అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దీనిపై రాంబాబును వివరణ అడుగగా.. తన తండ్రి తరచూ ఇలా ఇల్లు వదిలి వెళ్లి 10 లేదా 15 రోజులకు తిరిగి వస్తాడని, ఈ సారి కూడా అలాగే వస్తాడనుకుని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని చెప్పాడు. అయితే, ఎప్పుడైనా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు వెళ్లి వచ్చేవాడని, ఈసారి మాత్రం రాష్ట్రం దాటి వెళ్లిపోయాడని, అందుకే తిరిగి రాలేకపోయాడేమోనని అన్నాడు. అయితే, రెండు నెలల నుంచి దిక్కుతోచక తిరిగిన వెంటకస్వామి ఎట్టకేలకు కుటుంబసభ్యుల చెంతకు చేరనుండటం సంతోషకరం.
“Crypto Currency | అమ్మ బాబోయ్.. భారత్లో పన్నులమోత.. క్రిప్టోకు అనుకూలం కాదు..!”
cyber blackmail | అమ్మాయిలూ.. మీ పర్సనల్ వీడియోలు పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారా?
అమ్మాయిలు ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు? వాటి నుంచి ఎలా బయటపడాలి?