Crypto Currency | క్రిప్టో కరెన్సీల పట్ల భారత్ అనుసరిస్తున్న వైఖరిపై గ్లోబల్ క్రిప్టో ఎక్స్చేంజ్ ‘బినాన్స్’ సీఈవో ఛాంగ్పెంగ్ జావో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ‘క్రిప్టో ఫ్రెండ్లీ’ మార్కెట్ కాదని చెప్పారు. గురువారం ఆయన టెక్క్రంచ్ క్రిప్టో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ భారత్లో క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్పై పన్నుల మోత తట్టుకోలేం అని వ్యాఖ్యానించారు. తమ సంస్థ వంటి ఎక్స్చేంజ్లు వ్యాపార లావాదేవీలు జరుపడానికి భారత్ అనుకూలం కాదని అన్నారు. క్రిప్టో కరెన్సీలపై ట్రేడింగ్లో వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను, క్రిప్టో ట్రాన్సాక్షన్స్పై ఒకశాతం టీడీఎస్ కోత విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ ఎంత మాత్రం క్రిప్టో ఫ్రెండ్లీ మార్కెట్ కాదని ఛాంగ్పెంగ్ జావో స్పష్టం చేశారు.
‘ఈ రోజు భారత్లో క్రిప్టో కరెన్సీల బిజినెస్ నిర్వహణ లాభదాయకం కాదు. ఒక యూజర్ 50రెట్లు ట్రేడింగ్ చేస్తే, దానిపై వచ్చే ఆదాయానికి 30 శాతం పన్ను చెల్లించాలి. మిగతా ఆదాయంలోనూ సంబంధించి ప్రతి ట్రాన్సాక్షన్ పైన ఒకశాతం టీడీఎస్ చెల్లించాలి. ఈ పరిస్థితుల్లో భారత్లో క్రిప్టో ట్రేడింగ్ జరిపే వారికి లాభ దాయకం కాదు. లాభదాయకం కాని దేశాల్లో బిజినెస్ జరుపాలని మేం భావించడం లేదు’ అని ఛాంగ్పెంగ్ జావో తేల్చేశారు. మొత్తం క్రిప్టో ట్రేడింగ్లో వచ్చే ఆదాయంలో 70 శాతం పన్ను చెల్లింపులకే వెళుతుందని, దీనివల్ల భారత్లో క్రిప్టో ట్రేడింగ్ అనుకూలం కాదన్నారు.
అయినప్పటికీ క్రిప్టో కరెన్సీ ట్రేడర్లకు భారత్ లాభాలు తెచ్చేపెట్టే అవకాశాలు ఉన్నాయని ఛాంగ్పెంగ్ జావో స్పష్టం చేశారు. గత ఆగస్టులో బినాన్స్లో 4.29 లక్షల డౌన్లోడ్లు నమోదయ్యాయని చెప్పారు. ఇతర ఎక్స్చేంజ్ల్లో డౌన్ లోడ్లను ఇది అధిగమించిందని అన్నారు. 2017లో ఏర్పాటైన క్రిప్టో ఎక్స్చేంజ్ బినాన్స్…. ఇప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యంత లైసెన్స్ గల క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్గా నిలచింది.
తొలి నుంచి క్రిప్టో కరెన్సీలు భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తాయని ఆర్బీఐ వాదిస్తున్నది. ఈ వైఖరితో ఏకీభవించిన కేంద్ర ఆర్థికశాఖ.. క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై ఉక్కుపాదం మోపింది. అంతర్జాతీయంగా విస్తరించ తలపెట్టిన క్రిప్టో ఎక్స్చేంజ్లు.. ‘క్రిప్టో’ కరెన్సీలపై భారత్ పన్ను విధిస్తున్న తీరుపై విమర్శలు ఎక్కు పెట్టాయి. క్రిప్టో లావాదేవీలపై 30శాతం పన్ను, ప్రతి లావాదేవీపై ఒకశాతం టీడీఎస్ విధించింది కేంద్ర ఆర్థికశాఖ. అంతే కాదు క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్తో వచ్చే ఆదాయంపై పన్ను మినహాయింపు ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. గత ఫిబ్రవరి ఒకటో తేదీన 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రసంగంలో తేల్చి చెప్పారు.