కోల్ కతా : కొవిడ్-19 కేసులు గణనీయంగా తగ్గడంతో పశ్చిమ బెంగాల్ లో లాక్డౌన్ నియంత్రణలకు పలు సడలింపులు ప్రకటించారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందిని విధుల్లోకి అనుమతిస్తామని సీఎం మమతా బెనర్జీ గురువారం ప్రకటించారు. ఇతర రాష్ట్రాల తరహాలో తాము లాక్డౌన్ విధించలేదని, కఠిన నియంత్రణలతోనే వైరస్ ను కట్టడి చేస్తామని చెప్పారు.
బెంగాల్ లో కొవిడ్-19 కేసులు సగానికి తగ్గాయని ఇప్పటివరకూ 1.4 కోట్ల వ్యాక్సిన్ డోసులు ప్రజలకు ఉచితంగా అందించామని దీదీ పేర్కొన్నారు. ప్రధాన ఆలయాల్లో పూజారులకు వ్యాక్సినేషన్ చేపడతామని చెప్పారు. ఇక రిటైల్ షాపులను మద్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ అనుమతిస్తారు. ఐటీ సెక్టార్ ను రెండు షిఫ్టుల్లో పనిచేసే వెసులుబాటు కల్పించారు. వ్యాక్సిన్ పూర్తయిన సిబ్బందితో రెస్టారెంట్లు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ తెరిచేందుకు అనుమతించారు.