West Bengal : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం పదవికి రాజీనామా చేయబోనంటూ మొండి పట్టుదలతో ఉన్న మమతా బెనర్జీకి గవర్నర్ షాకిచ్చారు. మమత ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ ఆర్ఎన్ రవి తెలిపారు. దీంతో 2021–2026 వరకు ఉన్న మమత ప్రభుత్వం అధికారికంగా రద్దైంది. దీంతో ఇకపై మమత సీఎం పదవి కూడా రద్దైంది.
గవర్నర్ నిర్ణయంతో రెండు రోజులుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 (2)బి ఆధారంగా మమత ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు గవర్నర్ వెల్లడించారు. ఈ నిర్ణయం గురువారం, మే 7 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ రద్దు నిర్ణయంపై మమతా బెనర్జీ ఇంకా స్పందించలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం ఓటమి పాలైంది. బీజేపీ 207 సీట్లతో అధికారం దక్కించుకుంది. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి. కానీ, ఈ ఓటమిని మమత అంగీకరించడం లేదు. తాము ఓడిపోలేదని, బీజేపీ, ఈసీ కలిసి కుట్ర చేసి తమను ఓడించాయని ఆమె ఆరోపించారు.
ఈ నేపథ్యంలో తాను సీఎం పదవికి రాజీనామా చేయబోనని ఆమె అన్నారు. దీంతో ఈ అంశం రాజకీయంగా ఉత్కంఠకు దారితీసింది. మిగతా రాష్ట్రాల్లో సీఎంలు ఫలితాలు వెలువడ్డ మరునాడే రాజీనామా చేశారు. కానీ, మమత ఇంతవరకు సీఎం పదవికి రాజీనామా చేయలేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం కీలకంగా మారింది. మరో రెండు రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలోని కొత్త ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో కొలువుదీరనుంది.