West Bengal : ‘సర్’ ప్రక్రియలో తొలగించిన ఓటర్లకు ఈసారికి ఓటు వేసే అవకాశం కల్పించలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది. పశ్చిమ బెంగాల్లో ‘సర్’ ప్రక్రియ అనంతరం లక్షలాది మంది ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించిన సంగతి తెలిసిందే. తొలగించిన వారిలో పేర్లు కోల్పోయిన కొందరు ఓటర్ల తరఫున టీఎంసీ పార్టీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
‘సర్’ ద్వారా ఓటు హక్కు కోల్పోయిన వారికి ఈ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ టీఎంసీ లీడర్ కల్యాణ్ బెనర్జీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారికి ఓటు హక్కు కల్పించాలని కోరారు. ఈ అంశంలో 1.6 మిలియన్ల ఓటర్ల అభ్యర్థనలు సంబంధిత వ్యవస్థల వద్ద పెండింగ్లో ఉన్నాయని, వారందరికీ ఓటు వేసే అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్యా ఆధ్వర్యంలోని బెంచ్ విచారణ జరిపింది. ఇది సాధ్యం కాని విషయం అని కోర్టు పేర్కొంది. ఈ అంశం సంబంధిత ట్రిబ్యునల్స్ వద్ద పెండింగ్లో ఉందని, తాము జోక్యం చేసుకోవడం వల్ల వాటి న్యాయ ప్రక్రియకు భంగం కలుగుతుందని కోర్టు అభిప్రాయపడింది. ‘సర్’లో ఓటు కోల్పోయిన వారికి అవకాశం కల్పిస్తే దీనిపై విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్స్ మీద ఒత్తిడి పెరుగుతుందని, అనవసర, గందరగోళ పరిస్థితిని తాము సృష్టించలేమని తెలిపింది. ఇందుకు అనుమతిస్తే, దీనితో సంబంధం ఉన్న ఇతరుల ఓటు హక్కుల్ని తొలగించినట్లవుతుంది అని కోర్టు వ్యాఖ్యానించింది.
ఇప్పటికే సర్కు సంబంధించి 3.4 మిలియన్ల అభ్యర్థనలు పెండింగ్లో ఉన్నాయని జస్టిస్ జోయ్మాల్యా తెలిపారు. ఈ నేపథ్యంలో తాము వారికి ఓటు వేసే అవకాశం కల్పించలేమని స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందే పశ్చిమ బెంగాల్లో పలువురు పేర్లను ఓటర్ల జాబితా నుంచి ‘సర్’ అనంతరం ఈసీ తొలగించింది. తుది ఓటర్ల జాబితా ప్రకటించింది. దీంతో ఎన్నికలకు ముందు ఇందులో కొత్త పేర్లు చేర్చడానికి అవకాశం లేదు. సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప ఈ విషయంలో మార్పు ఉండదు. అయితే, ఇప్పుడు సుప్రీం కోర్టు మాత్రం దీనికి నిరాకరించింది. పశ్చిమ బెంగాల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నెల 23, 29 తేదీల్లో ఎన్నికలు జరుగుతాయి.